భారత సంతతి వ్యక్తిని ఉరి తీయొద్దంటూ.. Singapore లో ఆన్​లైన్​ వేదికగా భారీ ఉద్యమం!

ABN , First Publish Date - 2021-11-06T17:11:37+05:30 IST

మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఉరిశిక్ష పడిన ఓ భారత సంతతి వ్యక్తి కోసం సింగపూర్​లో ఆన్‌లైన్ వేదికగా భారీ ఉద్యమం నడుస్తోంది. అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆన్​లైన్​‌లో మానవ హక్కుల సంఘాలు భారీ మొత్తంలో సంతకాలు సేకరిస్తున్నాయి. అక్టోబర్ 29న ఆన్​లైన్ వేదికగా 50వేల సంతకాల సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

భారత సంతతి వ్యక్తిని ఉరి తీయొద్దంటూ.. Singapore లో  ఆన్​లైన్​ వేదికగా భారీ ఉద్యమం!

సింగపూర్​ సిటీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఉరిశిక్ష పడిన ఓ భారత సంతతి వ్యక్తి కోసం సింగపూర్​లో ఆన్‌లైన్ వేదికగా భారీ ఉద్యమం నడుస్తోంది. అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆన్​లైన్​‌లో మానవ హక్కుల సంఘాలు భారీ మొత్తంలో సంతకాలు సేకరిస్తున్నాయి. అక్టోబర్ 29న ఆన్​లైన్ వేదికగా 50వేల సంతకాల సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. దీనిలో భాగంగా ఇప్పటివరకు 39,962 సంతకాలను సేకరించాయి. ఇంతకు ఆ భారత సంతతి వ్యక్తి ఎవరు? అతని కోసం మానవ హక్కుల సంఘాలు ఎందుకు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి? నిజంగానే అతడు ఈ నేరం చేశాడా? ఎవరైనా బలవంతంగా అతనితో ఈ పని చేయించారా? అనే విషయాలు తెలియాలంటే మనం ఈ స్టోరీ చదవాల్సిందే. 


మలేసియాకు చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం అనే భారత సంతతి వ్యక్తి 2009లో సింగపూర్​లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతని వద్ద 42.72 గ్రాముల హెరాయిన్‌ దొరికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అభియోగంపై దోషిగా తేలిన నాగేంద్రన్‌కు 2010లో సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో నవంబరు 10న నాగేంద్రన్‌కు మరణశిక్షను అమలు చేయనున్నట్లు అక్కడి మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆందోళన చెందిన మానవ హక్కుల సంఘాలు క్షమాభిక్ష కోసం ప్రయత్నిస్తున్నాయి. మానసిక వికలాంగుడైన(హైపర్ యాక్టివిటీ డిజార్డర్​తో బాధపడుతున్నట్లు సమాచారం) నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్‌కు అభ్యర్థనలు పంపుతున్నాయి. 


దీనికోసం అక్టోబర్ 29న ఆన్​లైన్ వేదికగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 50వేల సంతకాల సేకరణే లక్ష్యంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గురువారం నాటికి 39,962 సంతకాలను సేకరించాయి. మానసిక వికలాంగుడైన వ్యక్తికి మరణశిక్ష విధించొద్దంటూ మానవ హక్కుల కార్యకర్తలు విన్నవిస్తున్నారు. అంతేగాక తన ప్రేయసిని హత్య చేస్తామని బెదిరించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నాగేంద్రన్​తో బలవంతంగా డ్రగ్స్ అక్రమ రవాణా చేయించారని వారు పేర్కొంటున్నారు. అందుకే దోషికి క్షమాభిక్ష ప్రసాదించాలని సంతకాలు సేకరిస్తున్న తమ పిటిషన్‌ ద్వారా వారు అభ్యర్థిస్తున్నారు. 


అయితే, 2010లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే అతడు ఈ తప్పు చేసినట్లు హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించినట్లు సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. అతనితో బలవంతంగా ఈ పని చేయించారనే వాదనలను తోసిపుచ్చింది. అటు క్షమాభిక్ష కోసం నాగేంద్రన్ అధ్యక్షునికి పెట్టుకున్న అర్జీ కూడా తిరస్కరణకు గురైందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. నాగేంద్రన్ ఫ్యామిలీ మలేసియా నుంచి సింగపూర్‌కు వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. దీనిబట్టి చూస్తే నాగేంద్రన్‌కు నవంబర్ 10న ఉరిశిక్ష అమలు చేసే ఉద్దేశంతోనే సింగపూర్ సర్కార్ ఈ ఏర్పాట్లు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2021-11-06T17:11:37+05:30 IST