మొరాయిస్తున్న మెట్రో..!

ABN , First Publish Date - 2021-01-06T06:36:18+05:30 IST

మియాపూర్‌ - ఎల్‌బీనగర్

మొరాయిస్తున్న మెట్రో..!


వెంటాడుతున్న సాంకేతికలోపాలు

ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ప్రయాణికులు


మెట్రోరైళ్లలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పుంజుకుని ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటున్నా సాంకేతిక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మానవ రహిత మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చి పరుగులు తీయిస్తున్న తరుణంలో నగర మెట్రోలో ఇటువంటి పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. 


హైదరాబాద్‌ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మియాపూర్‌ - ఎల్‌బీనగర్‌, నాగోలు - రాయదుర్గం, జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ కారిడార్లలో నిత్యం 55 మెట్రోరైళ్లు 820 టిప్పులు రాకపోకలు సాగిస్తున్నాయి. కరోనా అనంతరం సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రో రైళ్లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. గతంలో రోజూ 4.50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు రాకపోకలు సాగించగా, ప్రస్తుతం 1.68 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. మెట్రో సంస్థ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నా వరుస సాంకేతిక సమస్యలతో రైళ్లు ఎక్కేందుకు చాలామంది వెనకంజ వేస్తున్నారు. 


కొన్ని సంఘటనలు..


గతంలో ఇంజనీరింగ్‌ పనుల కారణంగా పలుమార్లు స్టేషన్లలో రైళ్లు నిలిచిపోగా, ఎక్కువ సార్లు సాంకేతిక సమస్యలతోనే ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2017 డిసెంబర్‌ 31న నాగోలు-అమీర్‌పేట మార్గంలో 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. 2018 జనవరి 3న మెట్టుగూడ-అమీర్‌పేట రూట్‌లో దాదాపు 2 గంటలపాటు రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. 2018 అక్ట్టోబర్‌ 13న బాలానగర్‌ మెట్రోస్టేషన్‌లో, 2020 సెప్టెంబర్‌ 1న నాగోలు-హైటెక్‌సిటీ రూట్‌లో, 2019 అక్టోబర్‌ 18న ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, 2020 ఫిబ్రవరిలో అమీర్‌ పేట-హైటెక్‌సిటీ మార్గంలో అరగంటపాటు రైళ్లు నిలిచిపోయాయి. 2020 నవంబర్‌ 18న మియాపూర్‌ స్టేషన్‌లో గంటల తరబడి ఆగిపోయింది. అప్పటికే స్టేషన్‌కు వచ్చిన, రైలులో ఉన్న ప్రయాణికులను ఆటోలు, క్యాబ్‌ల ద్వారా వారి గమ్యస్థానాలకు తరలించారు. మియాపూర్‌లో టికెట్లు తీసుకున్న కొందరిని ప్రైవేట్‌ వాహనాల ద్వారా జేఎన్‌టీయూ స్టేషన్‌కు తరలించారు. మియాపూర్‌లో రైలు ఆగిపోవడంతో జేఎన్‌టీయూ నుంచి ఎల్‌బీనగర్‌కు మాత్రమే రైళ్లను నడిపించారు. రైలు నడుస్తున్న క్రమంలో కొన్ని సార్లు పట్టాలపై, మరికొన్ని సార్లు స్టేషన్లలో ఆగిపోతుండడంతో మెట్రో సేవలపై నగరవాసులు అసంతృప్తికి లోనవుతున్నారు. 


మరోసారి నిలిచిపోయిన మెట్రో 

మంగళ్‌హాట్‌, జనవరి 5(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ - అమీర్‌పేట మార్గంలో మంగళవారం మెట్రోరైలు ఆగిపోయింది. దీంతో ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్లలో రైళ్లు దాదాపు అరగంటపాటు నిలిచిపోయాయి. ఉదయం వేళలో సమస్య తలెత్తడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు హుటాహుటిన టెక్నీషియన్లను పిలిపించి సమస్యను పరిష్కరించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2021-01-06T06:36:18+05:30 IST