ఎంజీఎంలో నరక యాతన!

ABN , First Publish Date - 2020-08-04T08:48:01+05:30 IST

ఎంజీఎంలో నరక యాతన!

ఎంజీఎంలో నరక యాతన!

కరోనా బాధితులకు అందని వైద్యం.. ఏఎంసీ వార్డులోకి వర్షపు నీరు 


వరంగల్‌ అర్బన్‌, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పేదల ఆస్పత్రి వరంగల్‌ ఎంజీఎం కరోనా రోగుల పాలిట నరక కూపంగా మారింది. పారిశుధ్యం అధ్వానంగా మారడం, వసతులు, వైద్యు లు లేకపోవడం వంటి కారణాలతో వారు నానా యాతనలు పడుతున్నారు. శ్వాస సంబంధ సమస్యలతో వచ్చే వారిని ఉంచే కొవిడ్‌ వార్డు రోగులతో కిక్కిరిసి పోయింది. అదనపు పడకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నావాటిని అమర్చే వారే లేరు. చాలా మంది వైద్యులు కరోనా బాధితులుగా మారారు. దీంతో వారంతా క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. దీంతో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు లేకుండా పోయారు. జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ ఇప్పటికే అదనపు డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ లోపు రోగులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు.. మరోవైపు ఆదివారం రాత్రి కురిసిన వర్షం తో నీరు వార్డుల్లోకి చేరుకుంది. అసలే పారిశు ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం, నీరు చేరుకోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది.  అంటురోగాలు ప్రబలుతాయని భయాందోళన చెందుతున్నారు. 


ల్యాబ్‌ టెక్నీషియన్ల ఆవేదన 

ల్యాబ్‌ టెక్నీషియన్లు ఏకంగా ఆస్పత్రి ముందు తమ గోడును వెళ్ళ బోసుకున్నారు. కనీస రక్షణ పరికరాలు, సౌకర్యాలు లేకుండా ఏ విధంగా విధులు నిర్వహించాలని ఆవేదనతో ప్రశ్నించారు. 12 గంటల చొప్పున డ్యూటీలు నిర్వహించినా.. మళ్లీ డ్యూటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. 


మంత్రులు సమీక్షించినా మార్పు లేదు

గత నెల 28న స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావులు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో ఎంజీఎం ఆస్పత్రి పరిస్థితిపై సమీక్షించారు. అవసరమైన పరికరాలు, అదనపు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అర్బన్‌ జిల్లా ఇంచార్జి కలెక్టర్‌  హరిత ఈ మేరకు ఎంజీఎం ఆస్పత్రిలోని కోవిడ్‌ వార్డును సైతం సందర్శించి, సమస్యలు తెలుసుకున్నారు.. అయినా కూడా పరిస్థితిలో మార్పులేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-08-04T08:48:01+05:30 IST