అర్ధరాత్రి కలకలం.. సైకిల్ బెల్ మోగించి నోట్లు విసిరేశారు!

ABN , First Publish Date - 2020-05-05T14:40:22+05:30 IST

ఓ వీధిలో అర్ధరాత్రి ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు జారవిడిచిన ఘటన కలకలం రేపింది.

అర్ధరాత్రి కలకలం.. సైకిల్ బెల్ మోగించి నోట్లు విసిరేశారు!

చెన్నై: స్థానిక వెస్ట్‌మాంబళంలోని ఓ వీధిలో అర్ధరాత్రి ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు జారవిడిచిన ఘటన కలకలం రేపింది. ఆ నోట్లను చూసిన స్థానికులు వాటిపై కరోనా వైరస్‌ ఉంటుందని ఆందోళన చెందారు. ఆ నోట్లను ఇద్దరు యువకులు పారవేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా చెన్నై నగరమంతటా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి వెస్ట్‌ మాంబళం మాణిక్కం వీధిలో అర్ధరాత్రి సైకిలుపై వచ్చిన ఇద్దరు యువకులు ప్రతి ఇంటి ఎదుట రూ.20, రూ.50 నోట్లను విసిరి వేస్తూ వేగంగా వెళ్లిపోయారు. నోట్లను విసిరే ముందు ఆ యువకులు సైకిలు బెల్‌ మోగించారు.


ఆ అలికిడికి ప్రజలు తలుపులు తెరచి వీధికేసి చూడగా గడప ముందు  కొత్త రూ.20, రూ.50 నోట్లు పడి ఉండడం గమనించారు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఆ నోట్లనూ ప్రతి ఒక్కరూ పోటీపడి ఏరుకునేవారు. ప్రస్తుతం నగరమంతటా కరోనా వైరస్‌ వ్యాపిస్తుండటంతో స్థానికులు ఆ నోట్లను తాకేందుకు భయపడ్డారు. ఈలోగా కొందరు వీధిలో తిరుగుతూ రోడ్డుపై పడి ఉన్న నోట్లను తాకితే కరోనా వైరస్‌ సోకుతుందని, వాటిని తాకవద్దంటూ హెచ్చరికలు చేశారు.


పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన మాణిక్కం వీధికి చేరుకుని కరెన్సీ నోట్లను ప్లాస్టిక్‌ సంచిలో వేసుకున్నారు. ఆ నోట్లపై కరోనా వైరస్‌ ఉందో లేదో నిర్ధారించేందుకుగాను ప్రయోగశాలకు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో దృశ్యాల ఆధారంగా నోట్లు చల్లిన యువకుల ఆచూకీని గుర్తించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Updated Date - 2020-05-05T14:40:22+05:30 IST