అర్ధరాత్రి మలక్పేట్లో ఘోర రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-03-11T19:08:59+05:30 IST
చాదర్ఘాట్ పీఎస్ పరిధిలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన
- ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి మృతి
హైదరాబాద్ : చాదర్ఘాట్ పీఎస్ పరిధిలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఓల్డ్మలక్పేట్ ప్రాంతానికి చెందిన షోయెబ్ (19), ఇలాఫ్ (13) ఇద్దరూ విద్యార్థులే. బుధవారం రాత్రి ఓ ఫంక్షన్కు హాజరై బైక్పై తిరిగి వెళ్తున్న సమయంలో మలక్పేట సోహెల్ హోటల్ ఎదురుగా అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు (ఏపీఎస్ ఆర్టీసీ) వీరిని ఢీకొట్టింది. బస్సు చక్రాల కింద పడి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆగ్రహించిన స్థానికులు బస్సును అడ్డుకుని దాడి చేశారు. సమాచారం అందుకున్న చాదర్ఘాట్ పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల అక్కడికి చేరుకుని పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.