కర్ణాటక నుంచి మానుకోటకు వలస కూలీలు
ABN , First Publish Date - 2020-05-21T09:12:08+05:30 IST
లాక్డౌన్తో కర్ణాటక రాష్ట్రం లో చిక్కుకుపోయిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన వలస కూలీలు ఎట్టకేలకు మంత్రి
మంత్రి సత్యవతి సాయంతో బస్సుల్లో వచ్చిన కూలీలు
మహబూబాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి) : లాక్డౌన్తో కర్ణాటక రాష్ట్రం లో చిక్కుకుపోయిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన వలస కూలీలు ఎట్టకేలకు మంత్రి కేటీఆర్ చొరవతో బుధవారం బస్సుల ద్వారా స్వగ్రామాలకు చేరుకున్నారు. కర్ణాటకలో వలస కూలీలుగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహబూబాబాద్ జిల్లావాసులు 50 మంది తమను స్వరాష్ట్రానికి చేర్చేందుకు సహకరించాలని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేసుకున్నారు.
దీంతో స్పందించిన మంత్రి కేటీఆర్.. జిల్లాకు చెం దిన మంత్రి సత్యవతి రాథోడ్కు రీట్విట్ చేశారు. కర్ణాటక నుంచి వలస కూలీల స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో మంత్రి సత్యవతి రాథోడ్ అక్కడి వలస కార్మికులను తిరిగి జిల్లాకు రప్పించేందుకు తన సొంత ఖర్చుతో రెండు బస్సులను ఏర్పాటు చేయించారు. అక్కడి అధికారులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్కు సూచించారు. కలెక్టర్ గౌతమ్ కర్ణాటక అధికారులతో మాట్లాడి వారిని మహబూబాబాద్కు చేరేందుకు అన్ని చర్యలు తీ సుకున్నారు.
దీంతో మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 50 మంది వలస కార్మికులు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వేస్టేషన్ నుంచి బస్సులో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వీరిని జిల్లా యంత్రాంగం దగ్గరుండి ఆహ్వానించారు. మంత్రి సత్యవతి రాథోడ్కు వలస కార్మికులు ధన్యవాదాలు తెలిపా రు. వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారిని స్వగ్రామాలకు తరలించి, హోం క్వారంటైన్ చేస్తామని జిల్లా అధికారులు తెలిపారు.