భార్య మంగళసూత్రం అమ్మి సైకిలు కొన్న వలసకార్మికుడు
ABN , First Publish Date - 2020-06-02T19:08:48+05:30 IST
కరోనా లాక్డౌన్ వల్ల వలసకార్మికుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.....
కటక్ (ఒడిశా): కరోనా లాక్డౌన్ వల్ల వలసకార్మికుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వలసకార్మికులుగా ఒడిశా రాష్ట్రానికి చెందిన చందన్ జెన్ తన భార్య , స్నేహితుడు తపాన్ జెనాలతో కలిసి నివశించేవాడు. కరోనా లాక్ డౌన్ వల్ల కూలీ పనులు దొరక్క ఉపాధి కరవై తినేందుకు తిండి దొరక్క తన సొంత రాష్ట్రమైన ఒడిశాకు పయనమయ్యారు. తన భార్య మంగళసూత్రాన్ని విక్రయించగా వచ్చిన 15వేల రూపాయలతో రెండు సైకిళ్లు కొని వాటిపైనే ముగ్గురు ఒడిశాకు పయనమయ్యారు. భద్రక్ జిల్లా బాసుదేవపూర్ గ్రామానికి చెందిన చందన్ తన గ్రామానికి వెళ్లేందుకు సైకిళ్లపై బెంగళూరు నుంచి కటక్ నగరానికి చేరుకున్నారు. కటక్ నగరంలో కొందరు సామాజిక వేత్తలు చూసి చందన్ కథ తెలుసుకొని చలించిపోయారు.భార్య మంగళసూత్రాన్ని విక్రయించి సైకిళ్లు కొని వాటిపైనే బెంగళూరు నుంచి వచ్చిన వలసకూలీల కష్టాలు తెలుసుకొని ఆవేదన చెందారు. అనంతరం చందన్ దంపతులతోపాటు వారి మిత్రుడు తపన్ జెనాలకు భోజనం పెట్టి వాటర్ బాటిళ్లు ఇచ్చి వారి స్వగ్రామానికి వ్యానులో పంపించారు. వలసకార్మికులను ఆదుకున్న వారిని కటక్ వాసులు అభినందించారు.