HYD : ఎల్లుండి ‘మిలాదున్ నబీ’కి భారీ బందోబస్తు..
ABN , First Publish Date - 2021-10-17T12:47:48+05:30 IST
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకొనే ఈ నెల 19న జరిగే....
- మత పెద్దలతో సీపీ సమావేశం
హైదరాబాద్ సిటీ/చార్మినార్ : మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకొనే ఈ నెల 19న జరిగే మిలాదున్ నబీ ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని సీపీ కోరారు. శనివారం సాలార్జంగ్ మ్యూజియంలో ముస్లిం మతపెద్దలతో సీపీ అంజనీకుమార్ సమావేశమయ్యారు. ముఫ్తీ సాదిక్ మోహియుద్దీన్, మౌలానా సయ్యద్ అలీ హుస్సేన్ పాష, మౌలానా నిస్సార్ హుస్సేన్ హైదర్ ఆగా, మౌలానా సయ్యద్ ఖాద్రి, మౌలానా జాఫర్పాష, ముఫ్తీ న్యామతుల్లా ఖాద్రి, హఫీజ్ ముజఫర్ హుస్సేని బందనవాజ్, హజరత్ మౌలానా సయ్యద్ షా ఔలియా హుసేని ముర్తుజా పాష, మిర్జా రియాజుల్ హసన్ (ఎంఎల్సీ), సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి (ఎంఎల్ఏ)లు హాజరయ్యారు.
పోలీసు శాఖ తరపున అదనపు సీపీలు షికాగోయెల్, డీఎస్ చౌహాన్, ఐజీపీ విజయ్కుమార్, సౌత్జోన్ డీసీపీ గజరావు భూపాల్, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్లతో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. భద్రతా ఏర్పాట్లు... తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఉత్సవాల సందర్భంగా యువకులు బైకులపై ర్యాలీలు, స్టంట్లు చేయరాదని సీపీ సూచించారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి ఎలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ అన్నారు. ర్యాలీ ముగిసేంత వరకు ఫ్లైఓవర్లపై వాహనాలకు అనుమతి లేదన్నారు.