కోవిడ్-19 ఆసుపత్రిగా మిమ్స్
ABN , First Publish Date - 2020-04-04T11:12:28+05:30 IST
మిమ్స్ ఆసుపత్రిని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చామని కలెక్టర్ ఎం.హరిజవహర్లాల్ అన్నారు.
వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వండి
అత్యవసర వార్డులు సిద్ధంగా చేయాలి
కలెక్టర్ హరిజవహర్లాల్
విజయనగరం (ఆంధ్రజ్యోతి), ఏప్రిల్ 3: మిమ్స్ ఆసుపత్రిని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చామని కలెక్టర్ ఎం.హరిజవహర్లాల్ అన్నారు. శుక్రవారం తన చాంబర్లో కోవిడ్-19 ఆసుపత్రిలో ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సోకిన వారికి అందించాల్సిన సేవలపై వైద్యులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. కరోనా రోగులు ఆసుపత్రికి వచ్చినా, రాకపోయినా సిబ్బం ది మాత్రం ప్రతిరోజూ ఆసుపత్రికి హాజరుకావాల్సివుంటుందని తెలిపారు. క్వారంటైన్, అత్యవసర వార్డులు సిద్ధంగా ఉంచాలన్నారు. ఎలాంటి పరి స్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆసుపత్రికి కావలసిన శానిటైజర్లు, మాస్క్లు, గ్లౌజ్లు, మందులు, ఇతరత్రా సామగ్రి కొనుగోలుకు ఇండెంట్ పెట్టి కొనుగోలు చేసుకోవాలని డీఎంహెచ్వో రమణకుమారికి సూచించారు.
ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఆసుపత్రి సమన్వయకర్తకు ప్రతిరోజు రిపోర్ట్ చేయాల్సివుంటుందన్నారు. వీరిని కూడా కరోనా వైరస్ బారిన పడిన వారికి సేవలందించేందుకు వినియోగించు కుంటామని తెలిపారు. క్వారంటైన్లో ఉన్న వారికి సేవలు అందించేందుకు గాను 18 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకువచ్చారన్నారు. వీరి సేవ లను వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో జేసీ కిశోర్కుమార్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.