పోషకాల గని... నల్ల బియ్యం!

ABN , First Publish Date - 2021-05-10T17:06:08+05:30 IST

తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీలో ఎంఏ యజుర్వేద భాష్యం చదివే కౌటిల్య కృష్ణన్‌ వైదిక పద్ధతిలో నల్ల ధాన్యం(కృష్ణ వ్రీహీ) సాగు చేశారు. తాను వేదాల్లో చదివిన అంశాలతో

పోషకాల గని... నల్ల బియ్యం!

కిలో ధర రూ.300 నుంచి 3,000 వరకు

వైదిక పద్ధతిలో 2 ఎకరాల్లో సాగు 

ఈ ఏడాది 40 క్వింటాళ్ల దిగుబడి 

సంస్కృత వర్సిటీ విద్యార్థి ఘనత 

అంతర్జాతీయంగానూ డిమాండ్‌ 


తిరుపతి(విద్య), మే 9: తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీలో ఎంఏ యజుర్వేద భాష్యం చదివే కౌటిల్య కృష్ణన్‌ వైదిక పద్ధతిలో నల్ల ధాన్యం(కృష్ణ వ్రీహీ) సాగు చేశారు. తాను వేదాల్లో చదివిన అంశాలతో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా ఖాసింపేటలోని 2ఎకరాల్లో ఈ ఏడాది 40 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. వ్యవసాయం పట్ల తనకున్న ఆసక్తితో వేద వ్యవసాయ పద్ధతుల ద్వారా ఎలాంటి రసాయనాలు వాడకుండా ఈ విజయం సాధించారు. కరోనా కారణంగా ఇంటివద్ద ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతూ, మిగిలిన సమయంలో నల్లధాన్యం సాగు చేపట్టారు. యజుర్వేదం ఆధారంగా వేద వ్యవసాయ పద్ధతిలో సాగు కోసం పాలు, తేనెతో పాటు అగ్నిహోత్ర భస్మం, పేడను ఉపయోగించారు. సుశృత సంహిత ఆధారంగా విత్తనం ఎంపిక చేసి వృక్ష ఆయుర్వేదం, కృషిపరాశర గ్రంథం ఆధారంగా వేదవ్యవసాయ పద్ధతిని అనుసరించారు. పోషక గుణాలు అధికంగా ఉన్న నల్లబియ్యానికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ మంచి డిమాండ్‌ ఉంది. దీన్ని ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. 


ఈ సందర్భంగా వర్సిటీ వీసీ మురళీధర్‌ శర్మ మాట్లాడుతూ.. ప్రకృతి హితంగా పండించిన ఇలాంటి ఆహారం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శక్తిమంతమైన జాతి తయారవుతుందన్నారు. మన మహర్షులు అందించిన వ్యవసాయ విజ్ఞానమే ఈ నల్లధాన్యం సాగు విజయానికి కారణమన్నారు. కాగా, నల్లధాన్యం పంట సాగుకు ఎకరాకు రూ.10 వేల లోపు ఖర్చు చేసినట్లు కౌటిల్య కృష్ణన్‌ పేర్కొన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేయడంతో ట్రాక్టర్‌ ఖర్చు, కూలీల ఖర్చుతోనే సరిపోతుందన్నారు. ఛత్తీ్‌సగఢ్‌ నుంచి మొదట కిలో విత్తనాలు తీసుకొచ్చి నారుపోసి పంట సాగుచేసినట్లు చెప్పారు. ఇలా పండిన ధాన్యాన్నే మళ్లీ విత్తనంగా వాడి.. ఈ ఏడాది 2ఎకరాల్లో నాటగా 40 క్వింటాళ్ల పంట వచ్చిందన్నారు. ఈ ధాన్యం కిలో రూ.300 నుంచి రూ.3వేల వరకు ఉంటుందన్నారు. కేన్సర్‌, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో నల్ల బియ్యం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ బియ్యంలో ప్రొటీన్లతో పాటు లిపిడ్స్‌, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయని, మెదడు, కాలేయ పనితీరును మెరుగుపరచి మలబద్దకాన్ని, అతిసారను నియంత్రిస్తాయన్నారు. కడుపులో మంట, షుగర్‌ లెవల్స్‌ను కూడా తగ్గిస్తుందని కౌటిల్య కృష్ణన్‌ వివరించారు. 


Updated Date - 2021-05-10T17:06:08+05:30 IST