పేదలందరికీ మెరుగైన వైద్యం

ABN , First Publish Date - 2020-06-05T10:09:33+05:30 IST

ప్రతి పేదవానికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని... ఇందులో భాగంగానే..

పేదలందరికీ మెరుగైన వైద్యం

ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి ఆగస్టులో టెండర్లు

నాడు-నేడు పనులకూ అధిక ప్రాధాన్యం

వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): ప్రతి పేదవానికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని... ఇందులో భాగంగానే విజయనగరంలో కొత్తగా వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఆగస్టులో దీనికి టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాలను ఆయన గురువారం పరిశీలించారు. మొదట జిల్లా కేంద్ర ఆసుపత్రి ప్రాంతంలోని దేవదాయ, పోలీస్‌ శాఖకు చెందిన భూములను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్ర డ్రగ్‌ స్టోర్‌ సమీపంలో ఉన్న భూములను కూడా పరిశీలించారు. తరువాత ఆంధ్ర విశ్వ విద్యాలయం ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ పరిధి భూములను పరిశీలించాక మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 వైద్య కళాశాలలను మంజూరు చేశామని... ఇందులో విజయనగరం ఒకటని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికే 11 వైద్య కళాశాలలు ఉన్నాయని... మరో 16 కళాశాలలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంజూరు చేశారని వివరించారు. వీటిలో కొన్ని నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి స్థల పరిశీలన పూర్తి చేస్తున్నామన్నారు. కళాశాల నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆగస్టులో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.


ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీలో అనేక రోగాలను చేర్చి పేదలకు కార్పొరేట్‌ వైద్యం చేరువ చేశామని చెప్పారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా విద్యా రంగానికి ప్రభుత్వం రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువస్తున్నామని వివరించారు. పేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించటమే లక్ష్యమని చెప్పారు. వైద్యానికీ అంతే ప్రాధాన్యం ఇస్తున్నదని, ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా నిరుపేదలుంటారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పాడేరు, అనకాపల్లి ప్రాంతాల్లో వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, పార్వతీపురం ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, అలజంగి జోగారావు, కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, జేసీ కిశోర్‌కుమార్‌, డీఎంఅండ్‌హెచ్‌వో రమణకుమారి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ జి.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T10:09:33+05:30 IST