ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం
ABN , First Publish Date - 2021-12-02T04:59:04+05:30 IST
వరదల్లో పూర్తిగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్కుమార్ తెలిపారు.
భగత్సింగ్ కాలనీలో మంత్రి అనిల్ పర్యటన
నెల్లూరు(వెంకటేశ్వరపురం), డిసెంబరు 1: వరదల్లో పూర్తిగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్కుమార్ తెలిపారు. నగరంలోని వరద భాదిత ప్రాంతమైన భగత్సింగ్ కాలనీలో బుధవారం పర్యటించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులతో మాట్లాడారు. స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదసాయం పంపిణీపై ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ వరదల్లో ఇల్లు కూలిపోయిన ప్రతి ఒక్కరికీ రూ.92 వేలతో పాటు సొంత నివాసం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. భగత్సింగ్ కాలనీకి వరదలు రాకుండా త్వరలోనే కట్టను నిర్మించనున్నట్లు తెలిపారు. పేదలకు ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ అండగా నిలుస్తారన్నారు. మంత్రి వెంట నగర కమిషనర్ దీనేష్కుమార్, స్థానిక కార్పొరేటర్ సఫియాబేగం, నాయకులు ముజీర్, మునీర్, జస్సమ్మ, అన్వర్, జమీర్, ఖయూమ్, ఖాజాబాబా, ప్రకాష్ తదితరులు ఉన్నారు.