కేంద్రమిచ్చే నిధులను మా జేబుల్లో వేసుకోము..: మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2020-09-25T18:04:19+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పందించారు.

కేంద్రమిచ్చే నిధులను మా జేబుల్లో వేసుకోము..: మంత్రి బాలినేని

ప్రకాశం: ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పందించారు. రైతులకు ఉచిత విద్యుత్ బోర్లకు మీటర్లు అమర్చే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ కష్టాల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వానికి మద్దతునిచ్చామని చెప్పుకొచ్చారు. కేంద్రమిచ్చే రూ.4 వేల కోట్ల ఫండ్ ప్రజల అభివృద్ధికి ఉపయోగిస్తాం తప్ప అవి తమ జోబుల్లో వేసుకోమనే విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు గ్రహించాలని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలా కేంద్రంతో ఒకరోజు మంచిగా ఉండటం మరో రోజు గొడవ పడటం కాకుండా రాష్ట్ర అభివృద్ధికోసం దీర్ఘకాలిక సఖ్యత అవసరమని భావించామని తెలిపారు. అదే పరిస్థితిలో రైతులకు అందించే ఉచిత విద్యుత్ విషయంలో రాజీపడమని స్పష్టం చేశారు. మరో 30సంవత్సరాల పాటు రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో మాట తప్పమని రైతులకు హామీ ఇస్తున్నామన్నారు. డిస్కంలకు చెల్లించవలసిన బిల్లును నేరుగా రైతుల అకౌంట్లలో ముందుగానే జమ చేస్తున్నామని... దీనిపై ఎవ్వరూ అనుమాన పడవలసిన అవసరం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. 

Updated Date - 2020-09-25T18:04:19+05:30 IST