పెట్రో ధరలను తగ్గించే ప్రసక్తే లేదు: బుగ్గన

ABN , First Publish Date - 2021-11-08T21:29:16+05:30 IST

పెట్రో ధరల తగ్గింపుకు కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదని మంత్రి బుగ్గన అన్నారు.

పెట్రో ధరలను తగ్గించే ప్రసక్తే లేదు: బుగ్గన

న్యూఢిల్లీ: పెట్రో ధరలను తగ్గించే ప్రసక్తే లేదని, పెట్రో ధరల తగ్గింపుకు కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రాలకు ఉండదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ రాక్ ఆర్బిట్రేషన్ పరిష్కారానికి సంబంధించిన అంశాలపై కేంద్రమంత్రితో చర్చించానన్నారు. నూతనంగా ఆర్ధిక శాఖ సహాయ మంత్రులుగా నియమించబడిన మంత్రులు భగవత్ కరాడ్, పంకజ్ చౌదరిని మర్యాద పూర్వకంగా కలిశానన్నారు. సహాయ మంత్రులకు రాష్ట్ర పరిస్థితులు వివరించినట్లు చెప్పారు.


పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర నిర్ణయం ఇప్పటికే తెలిపామని, రాష్ట్ర ఆర్ధిక వనరుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని బుగ్గన అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి ఉండే ఖర్చులు వేరు.. కేంద్రానికి ఉండే ఖర్చులు వేరని, ఇప్పటికే పెంచిన పన్నులను కొంత తగ్గించామన్నారు. రాష్ట్రానికి పెట్రోల్, ఎక్సైజ్ ద్వారా మాత్రమే ఆదాయం వస్తుందని, కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-11-08T21:29:16+05:30 IST