‘గౌరవంగా ఆహ్వానించినా రాలేదు’

ABN , First Publish Date - 2021-08-04T16:05:46+05:30 IST

రాష్ట్ర శాసనసభ శతవార్షికోత్సవాలకు, దివంగత మాజీముఖ్యమంత్రి కరుణానిధి చిత్రపటావిష్కరణకు హాజరు కావాలని గౌరవప్రదంగా ఆహ్వానించినా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, అన్నాడీఎంకే ఎ

‘గౌరవంగా ఆహ్వానించినా రాలేదు’

- శతవార్షికోత్సవానికి అన్నాడీఎంకే గైర్హాజరుపై మంత్రి దురైమురుగన్‌ రుసరుసలు

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ప్రశంసలు


చెన్నై: రాష్ట్ర శాసనసభ శతవార్షికోత్సవాలకు, దివంగత మాజీముఖ్యమంత్రి కరుణానిధి చిత్రపటావిష్కరణకు హాజరు కావాలని గౌరవప్రదంగా ఆహ్వానించినా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం విచారకరమని, డీఎంకే ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటావిష్కరణకు అప్పటి ప్రతిపక్షమైన డీఎంకే సభ్యులు హాజరుకానందుకు నిరసనగా శాసనసభ శతవార్షికోత్సవాలకు, కరుణ చిత్రపటావిష్కరణకు హాజరు కాలేమని అన్నాడీఎంకే నేతలు చెబుతుండటం గర్హనీయమన్నారు. శాసనసభలో జయ చిత్రపటావిష్కరణకు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేను నాడు తగిన విధంగా గౌరవించలేదని, అందరిలానే సాధారణంగా తమకూ ఆహ్వానం పంపారని తెలిపారు. శాసనసభ శతవార్షికోత్సవాలు జరపాలని నిర్ణయించినప్పుడే ముఖ్యమంత్రి స్టాలిన్‌ వేడుకలకు అన్నిపార్టీలవారు హాజరయ్యేలా అందరినీ గౌరవంగా ఆహ్వానించాలని తనకు తెలిపారని, ఆ మేరకు అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామికి ఫోన్‌ చేసి మరీ ఆహ్వా నించానన్నారు. అయితే ఆయన ‘కారులో సేలం వెళ్తున్నాను.. పార్టీ నేతలతో మాట్లాడి చెబుతాను’ అంటూ సమాధానమిచ్చారని, తాను పట్టు విడవకుండా మీరు చెబితే పార్టీవారందరూ వింటారు కదా అని చెప్పినా పార్టీ నేతలతో సంప్రదించి తన నిర్ణయాన్ని చెబుతానని బదులిచ్చారని దురై మురుగన్‌ వివరించారు. ఆ తర్వాత వేడుకలకు వస్తారో రారో తెలియక తాను సతమతమయ్యాయనని, చివరకు శాసనసభ కార్యదర్శి ద్వారా వేడుకలకు అన్నాడీఎంకే సభ్యులెవరూ రారని తెలిసి దిగ్ర్భాంతి చెందానన్నారు. సాదరంగా ఆహ్వానించిన తనకు కనీస సమాచారం ఇవ్వకుండా.. నేరుగా శాసనసభ కార్యదర్శికి విషయం తెలియజేయడం వెనుక ఆంతర్యమేమిటో తనకు తెలియదన్నారు. 


అన్నామలైకి కితాబు...

శాసనసభ శతవార్షికోత్సవాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని దురైమురుగన్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ సిద్ధాంతపరంగా భిన్న భావాలు కలిగివున్నప్పటకీ.. అన్నామలై మంచి మనస్సుతో శతవార్షికోత్సవాలకు హాజరైనందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నానని పేర్కొన్నారు. మెకెదాటు వివాదంపై కర్నాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతామంటూ అన్నామలై ప్రకటించడంపై స్పందిస్తూ రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు పలుమార్లు చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం దక్కలేదని, అయినా అన్నామలై ఈ విషయంలో చూపుతున్న చొరవను అభినందించాల్సిందేనన్నారు. మెకెదాటు ఆనకట్ట నిర్మించి తీరుతామంటూ కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించడంపై దురై మురుగన్‌ మాట్లాడుతూ.. కొత్తగా పదవిలో వచ్చామన్న సంతోషంతో అలా మాట్లాడటం సహజమేనని, అయితే ట్రిబ్యునల్‌ను గౌరవించబోమని, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోబోమని ప్రకటించడం గర్హనీయమన్నారు. బసవరాజ్‌ బొమ్మై తండ్రి సుప్రీంకోర్టులో వేసిన కేసు వల్లే రాష్ట్ర ప్రభుత్వా లను కేంద్రం చీటికిమాటికి రద్దు చేసే అవకాశం లేకుండా పోయిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మైతో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సన్నిహితంగా మెలిగేవారని గుర్తు చేశారు. మార్కండేయ డ్యాంను నిర్మించడానికి ముందే గత అన్నాడీ ఎంకే పాలకులు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చి ఉండవచ్చని, అయితే ఆనకట్ట నిర్మించిన తర్వాతే ఆనాటి పాలకులు కోర్టుకు వెళ్ళారని చెప్పారు. సుప్రీంకోర్టు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించి రెండేళ్లయినా కేంద్రం ఇంకా ఏర్పాటు చేయలేదని దురైమురుగన్‌ చెప్పారు. కావేరి- గుండారు అనుసంధాన పథకాన్ని కర్నాటక ప్రభుత్వం వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని, ఈ పథకానికి సంబంధించి ఇంకా ప్రణాళిక రూపొందించకమునుపే నిరసన ప్రకటిస్తున్నారని దురైమురుగన్‌ దుయ్యబట్టారు. 

Updated Date - 2021-08-04T16:05:46+05:30 IST