రైతు ఉత్పత్తి దారుల సంస్థల ద్వారా మామిడి కాయల కొనుగోలు:ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-04-08T20:11:22+05:30 IST
మహిళలు స్వయం సమృద్ధిని సాధించడానికి డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటు చేశామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
వరంగల్ రూరల్: మహిళలు స్వయం సమృద్ధిని సాధించడానికి డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటు చేశామని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ కి అనుసంధానంగా ఈ సంఘాలు పని చేస్తాయని అన్నారు. కేవలం పొదుపు, సేవా దృక్పథంతో మాత్రమే ఇవి పనిచేస్తాయని, తద్వరా మహిళా సంఘాలను వ్యాపారం వైపు మళ్ళిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయని ఆయన తెలిపారు.ఇదే తరహాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధిలో భాగంగా, ఆచార్య కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా డ్వాక్రా సంఘాల మహిళలను మరింత సంఘటితం చేసి వారికి మరింత పెద్దయెత్తున ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సీజన్ ను బట్టి, మామిడి, పొప్పడి పండు, బత్తాయి, వాటర్ మిలన్, మాస్క్ మిలన్, జామ, సపోట వంటి పండ్ల వ్యాపారం జరుగుతున్నది.
ఈ ఏడాది ఇప్పటికే ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లో 90 మెట్రిక్ టన్నుల మామిడి కాయల వ్యాపారం జరిగింది. ఢిల్లీ, కోయంబత్తూరు, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ ఏడాది 1500 టన్నుల మామిడి కాయ aవ్యాపార లక్ష్యం. మామిడి హార్వెస్టింగ్ (కాయలను తెంపడం)పై జనవరి నెలలో 70 మందికి శిక్షణ ఇప్పించామని ఆయన తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలోని మహబూబ్ నగర్ లో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ వ్యాపార సంస్థలైన ఇఫ్ కో కిసాన్, వే కూల్, మెట్రో సూపర్ మార్కెట్, మోర్, సూపర్ డెయిలీ, ఫ్రెష్ టు హోం, ఫార్మ్ దేవ్ లు ఎఫ్పీఓల నుండి మామిడి కాయలను కొనుగోలు చేస్తున్నాయి.
ఈ సారి రాయపర్తిలో 70 మెట్రిక్ టన్నులు, వర్దన్నపేటలో 10 మెట్రిక్ టన్నులు, పర్వతగిరిలో 28 మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి అంచనా. ఇక్కడ బంగినపల్లి, కేసరి, పులస రకాల పండ్లు విరివిగా పండుతున్నాయి. ఈ గ్రూపుల ద్వారా వాటిని కొనుగోలు చేస్తే, కమిషన్, తరుగు, కోతలు వంటివేవీ ఉండకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి వారికి రావాల్సిన డబ్బులు జమ అవుతాయని మంత్రి తెలిపారు. కేంద్ర చట్టాల నేపథ్యంలోనూ సీఎం కేసిఆర్ రైతుల ధాన్యాన్ని 20వేల కోట్లతో కొనుగోలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా అన్ని వసతులు కల్పిస్తున్నారు. చెరువులు, కుంటలు ఈ ఎండా కాలంలోనూ కళకళలాడుతున్నాయి. కాబట్టి రైతులు లాభసాటి పంటలు మాత్రమే వేయాలని సూచించారు. ఆయిల్పామ్, వ్యాపార పంటలు, కూరగాయలు, పండ్లతోటల వైపు రైతులు మళ్లాలి. రైతులు లాభ పడాలనేది సీఎం కెసిఆర్ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.