కుల వివక్ష పై పోరాటం చేసిన మహాను భావుడు పూలే- ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-04-11T19:56:32+05:30 IST
కుల వివక్షపై పోరాటం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
వరంగల్: కుల వివక్షపై పోరాటం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గొప్ప విద్యావేత్తగా, సామాజిక తత్త్వవేత్త, ఉద్యమ కారుడని ఆయన కొనియాడారు. మహాత్మాజ్యోతిరావుపూలే జయంతిని పురస్కరించుకుని ఆదివారం వరంగల్ ములుగురోడ్లోని పూలే విగ్రహానికి మంత్రి సత్యవతి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పూలే తాను చెప్పిన విషయాలను తుచ తప్పకుండా ఆచరించి చూపారన్నారు. ఒక సాధారణ తోటమాలి కులంలో పుట్టిన ఆయన కులవివక్షపై పోరాటం చేశారని అన్నారు.
కుల విధానంలో ఆయన సామాజిక వర్గ లోపాలను ఎత్తిచూపారు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం రావాలన్నారు. సమాజంలో సగభాగం ఉన్న స్ర్తీలు అభివృద్ధి చెందక పోతే సమాజం అభివృద్ది చెందని పూలే భావించారు. అందువల్ల స్ర్తీలు విద్యావంతులు కావాలని ఆశించారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపారు. ఆయన స్థాపించిన పాఠశాలలో అన్నికులాల వారికి ప్రవేశం కల్పించారని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీలు గుండు సుధారాణి, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.