ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలి: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-07-25T00:34:27+05:30 IST

ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని, నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలి: మంత్రి ఎర్రబెల్లి

జనగామ: ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలని, నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శనివారం రాష్ట్ర పురపాలన, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు పుట్టినరోజు పురస్కరించుకుని నిర్వహిస్తున్న ముక్కోటి వృక్షార్చన లో భాగంగా దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. గ్రామాలు, పట్టణాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాయన్నారు. 


ఐటి రంగంలో రాష్ట్రం ఎంతో ముందంజలో ఉందన్నారు. ప్రయివేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలకల్పన జరిగిందని, గీసుకొండలో పెద్ద పరిశ్రమ ద్వారా లక్షలాది చేనేత కార్మికులు ఉపాధి పొందుతారన్నారు. కేటీఆర్ గత సంవత్సర పుట్టినరోజు సందర్భంగా ట్రస్ట్ ద్వారా ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ అందజేసినట్లు, ఆకుపచ్చ తెలంగాణా నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్పూర్తిగా తీసుకొని ఈ సంవత్సరం ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు. 

Updated Date - 2021-07-25T00:34:27+05:30 IST