రూ. 1,847 కోట్లు మంజూరు చేసిన 15వ ఆర్ధిక సంఘం- ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-08-14T20:06:50+05:30 IST
రాష్ర్టానికి ఈ ఏడాదికి 15వ ఆర్ధిక సంఘం తెలంగాణకు 1,847 కోట్ల నిధులను మంజూరు చేసిందని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
హైదరాబాద్: రాష్ర్టానికి ఈ ఏడాదికి 15వ ఆర్ధిక సంఘం తెలంగాణకు 1,847 కోట్ల నిధులను మంజూరు చేసిందని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇందులో మొదటి త్రైమాసిక నిధులు 308 కోట్లు విడుదల అయ్యాయని అన్నారు. ఈ నిధులను గ్రామ పంచాయితీలకు 85శాతం, మండలాలకు 10శాతం, జెడ్పీలకు 5శాతం నిధులను పంపిణీ చేస్తారన్నారు. ఈనిధులతో తాగునీటి సమస్యల నివారణ, వాన నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, సామాజిక మరుగుదోడ్ల నిర్మాణం, చెత్త ప్టాస్టిక్ సేకరణ, తడి, పొడి చెత్త వేరు చేయడం, పారిశుద్ధ్యం నిర్వహణ, కంపోస్ట్ ఎరువుల తయారీ వంటి వాటికి వినియోగించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ఆరేళ్ల క్రితం నిలిపి వేసిన ఆర్దిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం పునరుద్దరించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి హర్షం వ్యక్తం చేశారు.
కేంద్రానికి అనేక సార్లు సీఎం కేసీఆర్ , మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, తాను చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని అన్నారు. 15వ ఆర్దిక సంఘం నిధుల విడుదలతో గ్రామ పంచాయితీలు, మండల, జిల్లా ప్రజాపరిషత్ల సుదీర్ఘ నిరీక్షణకు సీఎం కేసీఆర్ ఆలోచన వల్ల తెరపడిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్లనే నిధుల విడుదల సాధ్యమైందన్నారు. ఈ నిధులతో స్థానిక సంస్థల పరిదిలోని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలుగుతాయని అన్నారు. స్థానిక ప్రజల అవసరాల మేరకు ఈ నిధులను వినియోగించాలని పంచాయితీ, మండల, జిల్లా పరిషత్ల ప్రజా ప్రతినిధులకు పోచంపల్లి విజ్ఞప్తిచేశారు.