కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి- ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2020-11-22T21:17:40+05:30 IST
గల్లీ కావాలో....ఢిల్లీ కావాలో ప్రజలు తేల్చుకోవాలని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్: గల్లీ కావాలో....ఢిల్లీ కావాలో ప్రజలు తేల్చుకోవాలని పంచాయితీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. అమ్మకు అన్నంపెట్టని బాపతు వాళ్లు, ఇక్కడ చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తరంటే ఎవరైనా నమ్ముతారా? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను వివరించాలని అన్నారు. ప్రజావసరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తీరతాయని అన్నారు.మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ముఖ్యనేతలు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 109 చోట్ల డబుల్బెడ్రూమ్ ఇండ్లను కట్టిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే కొన్నింటిలో గృహ ప్రవేశం జరిగిందన్నారు. మిగితా ఇండ్లలో గృహ ప్రవేశాలు ఎన్నికల తర్వాత ఉంటాయన్నారు. స్థానిక సంస్థల మీద పూర్తి అవగాహనతో ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని చెప్పారు.
ఇప్పుడు పనిచేసి గెలిపించిన వారికి తగిన గౌరవం ఉంటుందన్నారు. వాళ్లందర్నీ గుర్తుపెట్టుకుని పార్టీపరంగా ప్రభుత్వపరంగా అన్ని విధాలా గౌరవిస్తామన్నారు. కమిటీల వారీగా పనులు జరిగిపోవాలని, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవాలని సూచించారు.