నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణా శిబిరం:మంత్రి ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-01-17T23:45:42+05:30 IST
ప్రభుత్వం ప్రకటించనున్న వివిధ పోటీ పరీక్షలకు నిరుద్యోగ యువతను సిద్ధం చేయడానికి వీలుగా, ఉచిత శిక్షణ శిబిరాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు
పాలకుర్తి: ప్రభుత్వం ప్రకటించనున్న వివిధ పోటీ పరీక్షలకు నిరుద్యోగ యువతను సిద్ధం చేయడానికి వీలుగా, ఉచిత శిక్షణ శిబిరాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో లాగే, ఈ సారి కూడా పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరే విధంగా తొర్రూరు కేంద్రంగా తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి మండలాల యువతకు ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిర్వహించిన శిబిరాలలో శిక్షణ తీసుకున్న వాళ్ళల్లో చాలా మంది ఉద్యోగాలు పొందారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 20, 21, 22, 23 తేదీలలో ఆయా మండలాల పార్టీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయిచుకోవాలని, అడ్మిషన్ ఉచితంగా ఉంటుందని మంత్రి తెలిపారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్టు ద్వారా నిర్వహించే ఈ శిబిరం 60 రోజుల పాటు ఉంటుందని మంత్రి వివరించారు. ఇంకా అదనపు సమాచారం కోసం రాథోడ్ భాస్కర్ (9550032354), పూస మధు (9948901947), వినయ్ (8328335946)లను సంప్రదించాలని మంత్రి తెలిపారు.