చేస్తున్నది చెప్పుకుందాం! చేయాల్సింది చేసి చూపిద్దాం!!
ABN , First Publish Date - 2021-01-18T00:40:38+05:30 IST
సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామాల, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నది.
పాలకుర్తి: సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామాల, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నది. చేస్తున్నది ఎంతో ఉంది. చెప్పుకోవాల్సింది చాలా ఉంది. అదంతా ప్రలకు వివరిద్దాం. ఇంకా సమస్యలేమైనా ఉంటి వాటిని సమన్వయంగా ఎదుర్కొందాం. వాటిని పరిష్కరించే బాధ్యత నాది. ప్రభుత్వం చేస్తున్నది ప్రజలకు వివరించే బాధ్యత మీది అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజాప్రతినిధులకు ఉద్బోధించారు.
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలోని గ్రామాల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఆయా గ్రామాల్లోని ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాలపై ఈ రోజు, రేపు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మండలంలోని ధర్మపురం, పడమటి తండా (డి), సిత్యా తండా, లకావత్ తండా, లక్ష్మణ్ తండా, కామా రెడ్డి గూడెం, మన్ పహాడ్, గొల్లపల్లి, చౌడూరు, పడమటి తండా (పెద్ద తండా), అప్పిరెడ్డి పల్లె, కడవెండి, చిప్ప రాళ్ల బండ తండా, పొట్టిగుట్ట తండా, సీతారాం పురం, దర్మగడ్డ తండాల గ్రామాలపై ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ముఖ్య నాయ కులతో పాలకుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావానికి ముందు, కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులను బేరీజు వేయండి. ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఎన్ని రకాల పథకాలు అమలు అవుతున్నాయో పరిశీలించండి. వాటన్నింటినీ ప్రజల్లోకి జోరుగా తీసుకెళ్ళండి. అని ప్రజాప్రతినిధులకు మంత్రి తెలిపారు. అధికారంలోకి వచ్చాక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, లంబాడీల ఆత్మగౌరవాన్ని పెంపొందించాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ల పై అసెంబ్లీ తీర్మానాలు చేసినం. పార్లమెంట్ తీర్మానిస్తే తప్ప, బిల్లు పాస్ కాని పరిస్థితి. ఆ పని కేంద్ర ప్రభుత్వం చేయాల్సి వుందని మంత్రి తెలిపారు.
పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పారిశుద్ధ్యం నిరంతరం కొనసాగుతోంది. ఈ కారణంగానే కరోనాని సైతం ఎదుర్కొన్నాం. సీజనల్ వ్యాధులు అదుపులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఇక ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కాగా దేవరుప్పుల మండలంలోని మిగతా గ్రామాల సమీక్షను సోమవారం నిర్వహించనున్నారు.