భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు
ABN , First Publish Date - 2020-10-19T01:43:54+05:30 IST
శరన్నవరాత్రి శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పంచాయితీరాజ్శాఖ ఎర్రబెల్లి దయాకర్రావు ఆయనసతీమణితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
వరంగల్: శరన్నవరాత్రి శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పంచాయితీరాజ్శాఖ ఎర్రబెల్లి దయాకర్రావు ఆయనసతీమణితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ఎర్రబెల్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అభివృద్ధి, స్థితిగతులపై ఆలయన ఈవోతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అలాగే కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్టు చెప్పారు.
అతి పురాతన కాకతీయుల నాటి ఎంతో ప్రాశస్త్యం గల దేవాలయంగా భద్రకాళి ఆలయం ప్రసిద్దిపొందిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ఆలయం మరింత అభివృద్ది చెందుతోందన్నారు. ఇప్పటికే టాంక్బండ్ నిర్మాణం జరిగిందని, ఆలయ అభివృద్ధికి మరింత కృషి జరుగుతోందన్నారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తరహాలో అభివృద్ది పర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు.