Etela ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధం:ABNతో గంగుల
ABN , First Publish Date - 2021-07-20T14:24:11+05:30 IST
ఈటల ఆరోపణలపై మంత్రి గంగుల కమాలకర్ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు...
కరీంనగర్/హైదరాబాద్ : తనపై ఓ మంత్రి హంతక ముఠాతో చేతులు కలిపి పాదయాత్రను అడ్డుకుని, దాడి చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. అంతేకాదు.. మాజీ నక్సలైట్ ఒకరు తనకు ఈ సమాచారం ఇచ్చారని కూడా ఈటల చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఈటల.. ఓ మంత్రి అన్నారే తప్ప.. ఎక్కడా ఆ మంత్రి పేరుగానీ.. ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అని గానీ చెప్పలేదు. ఈటల చేసిన ఆరోపణలపై ఆ జిల్లా మంత్రి అయిన గంగుల కమాలాకర్తో హెడ్లైన్స్ షోలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మాట్లాడింది.
ఈ సందర్భంగా ఏబీఎన్తో గంగుల మాట్లాడుతూ.. ఈటల ఆరోపణలన్నీ అబద్ధాలేనని.. ఎన్నికల్లో సానుభూతి కోసమే ఈటల ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈటలది దిగజారుడు రాజకీయమని తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. బీజేపీలో ఉన్న ఈటల.. హత్య కుట్రపై అవసరమైతే సీబీఐ, ఎన్ఐఏతో విచారణ జరిపించుకోవచ్చని.. తాను సిద్ధంగానే ఉన్నానని ఒకింత సవాలే విసిరారు. కేంద్రంతో చెప్పి ఈటల ఆ ఆరోపణలపై త్వరగా నిగ్గు తేల్చాలని ఏబీఎన్ ముఖంగా గంగుల డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే ఈటల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని గంగుల విమర్శలు గుప్పించారు.