వీజీఎఫ్ సర్దుబాటు చేస్తేనే ఏపీలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్
ABN , First Publish Date - 2021-12-06T23:47:04+05:30 IST
వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) సర్దుబాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తేనే కాకినాడలో..
న్యూఢిల్లీ: వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) సర్దుబాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వస్తేనే కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం సాధ్యమవుతుందని పెట్రోలియ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కాకినాడలో 32 వేల 901 కోట్ల రూపాయల వ్యయంతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం 2017 జనవరి 27న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెయిల్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు చెప్పారు.
‘‘తదనంతరం ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాలంటే వయబులిటీ గ్యాప్ ఫండింగ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. అనంతరం వీజీఎఫ్ను సమకూర్చవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు భారీ మూలధన వ్యయం, పెట్టుబడుల అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పారిశ్రామీకరణతోపాటు రాష్ట్రానికి పన్నుల రూపంలో రాబడి పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అందువలన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే దీనిపై తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.’’ అని పెట్రోలియ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు.