సమాజానికి స్పూర్తి రామలింగారెడ్డి జీవితం- హరీశ్రావు
ABN , First Publish Date - 2020-08-15T23:41:05+05:30 IST
సామాజిక ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా , రాజకీయ నాయకుడిగా వివిధ రూపాల్లో దుబ్బాక శాసన సభ్యుడు రామలింగారెడ్డి ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని ఆర్ధికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
సిద్దిపేట: సామాజిక ఉద్యమకారుడిగా, జర్నలిస్టుగా , రాజకీయ నాయకుడిగా వివిధ రూపాల్లో దుబ్బాక శాసన సభ్యుడు రామలింగారెడ్డి ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని ఆర్ధికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆయన జీవితం సమాజానికి స్పూర్తిదాయకమని అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్అలీ అధ్యక్షతన జరిగిన రామలింగారెడ్డి సంస్మరణసభలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా కాకుండా తన కుటుంబ సభ్యుడిగా రామలింగారెడ్డితో తనకు రెండు దశాబ్ధాల అనుబంధం, ఆత్మీయత ఉన్నాయని అన్నారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి పోషించినప్రాత అమోఘమని అన్నారు. ఉద్యమ సమయంలో ఆయన మీద నమోదైనన్నికేసులు ఏ నాయకుడిపై కాలేదన్నారు.
మూడు దశాబ్ధాల క్రితమే ప్రజా ఉద్యమకారుడి రూపంలో ఆయన కేసీఆర్ను ఆకర్షించారని చెప్పారు. సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల్లో త్వరలో రామలింగారెడ్డి సంస్మరణ సభులు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రిహరీశ్రావు తెలిపారు. మెదక్పార్లమెంట్ సభ్యుడు ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ముక్కుసూటితనం, నిజాయితీ, నిరాడంబరత తదితర గుణాలు కలిగిన వ్యక్తి రామలింగారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా రామలింగారెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని చకెప్పారు. తనకు ఆయన ఆదర్శభావాలు నూరిపోశారని చెప్పారు.
సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తన చేతుల మీదుగా ఆదర్శ వివాహం జరిపించిన రామలింగారెడ్డికి తన చేతుల మీదుగానే చావు చేయాల్సి రావడం జీవితంలో మిగిలిపోయిన విషాదమని పేర్కొన్నారు. ప్రముఖ కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రామలింగారెడ్డి ఆదర్శ జీవితాన్ని రికార్డుచేసి నేటి తరానికి అందించాల్సిన అవసరం ఎంతయినా ఉందని అన్నారు. రామలింగారెడ్డి ఒక వ్యక్తికాదని, వ్యవస్ద అన్నారు. టీయూడబ్ల్యూజె ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తన ప్రసంగంలో రామలింగారెడ్డితో తనకున్న మూడుదశాబ్ధాల అనుబంధాన్ని , చారిత్రక పోరాట ఘట్టాలను గుర్తుచేశారు.