సిద్దిపేట కీర్తి కూడా పతంగుల లాగా ఎగరాలి: మంత్రి హరీష్

ABN , First Publish Date - 2021-01-14T17:48:09+05:30 IST

సిద్దిపేట కీర్తి కూడా పతంగుల లాగా దేశం మొత్తం కనపడేలా ఎగరాలని... అందరూ అనుకుంటే సిద్దిపేట కీర్తిని దేశం నలుమూలల వినిపించేలా చేద్దామని మంత్రి హరీష్‌రావు అన్నారు.

సిద్దిపేట కీర్తి కూడా పతంగుల లాగా ఎగరాలి: మంత్రి హరీష్

సిద్దిపేట: సిద్దిపేట కీర్తి కూడా పతంగుల లాగా దేశం మొత్తం కనపడేలా ఎగరాలని... అందరూ అనుకుంటే సిద్దిపేట కీర్తిని దేశం నలుమూలల వినిపించేలా చేద్దామని మంత్రి హరీష్‌రావు అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వచ్ సర్వేక్షన్‌లో భాగంగా  ఏర్పాటు చేసిన  కైట్ ఫెస్టివల్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ బెంగళూరు, వడోదర, హైదరాబాద్ వంటి వివిధ నగరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారని తెలిపారు. ఈ పండుగ మహా మహా నగరాల్లో జరుగుతుందని, సిద్దిపేట పట్టణం కూడా మహానగరాల సరసన ధీటుగా అభివృద్ధి జరుగుతుంది కనుక ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షన్ అనేది భారత ప్రభుత్వం చెత్తరహిత పట్టణాలు, క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండే పట్టణాలకు  అవార్డులు ఇస్తుందని అన్నారు.


ఈ ఏడాది సిద్దిపేటకు నెంబర్ వన్ అవార్డు రావాలని ఆకాంక్షించారు. సిద్దిపేట పట్టణ ప్రజలు సిద్దిపేటను స్వచ్ఛ సిద్దిపేటగా మార్చడానికి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పతంగుల పండుగను ప్రజల మధ్య ఐక్యతను ప్రజల్లో అవగాహన పెంచడానికి స్వచ్ఛ పతంగుల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. సిద్దిపేటలో ఇప్పటికే బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా మార్చుకున్నామన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ గురించి 1969కి ఫోన్ చేసి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని మంత్రి హరీష్‌రావు కోరారు. 


Updated Date - 2021-01-14T17:48:09+05:30 IST