సహకార సంఘాల అభ్యున్నతికి చర్యలు: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-07-31T20:10:17+05:30 IST

సహకార సంఘాల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు.

సహకార సంఘాల అభ్యున్నతికి చర్యలు: మంత్రి కన్నబాబు

విజయవాడ: సహకార సంఘాల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  అప్కోబ్ , సహకార శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. ఆడిట్ విధానాన్ని బలోపేతం చేయడం , పూర్తి స్థాయిలో సహకార సంఘాల కంప్యూటీకరణ , మానవ వనరుల పాలసీ తదితర నిర్ణయాలను తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత అప్కోబ్ చాలా ఒడిదుడుకులను చూసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి నాలుగు జిల్లాల్లో సహకార కేంద్ర బ్యాంకులు నష్టాల్లో ఉండేవన్నారు. జగన్ ప్రభుత్వ పారదర్శక నియమాలు, నియంత్రణ , ఇతర చర్యల వల్ల నేడు అన్ని జిల్లాల డీసీసీబీలు లాభాల బాటలో పడ్డాయన్నారు.ఈ ఏడాది 31 వేల కోట్ల రూపాయిల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  


అప్కోబ్‌లో ప్రతి రూపాయి రైతు కష్టమేనని స్పష్టం చేశారు. అత్యంత బాధ్యతగా , నిజాయితీగా రైతు డబ్బును మనమంతా కాపాడాలని సూచించారు.నిధుల దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు  తీసుకోవాలని హెచ్చరించారు. గుంటూరు సహా పలు జిల్లాల డీసీసీబీలు చాలా బాగా నడుస్తున్నాయన్నారు. రైతుకు, చిరు వ్యాపారస్తులకు ఉపయోగపడేలా వివిధ స్కీములను అమలు చేస్తున్నామన్నారు.డ్వాక్రా సంఘాలకు అప్పులిచ్చే కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నామన్నారు. ఇటీవల నియమితులైన అన్ని జిల్లాల డీసీసీబీ చైర్మన్లకు, డీసీఎంఎస్ చైర్మన్లకు మంత్రి కన్నబాబు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-07-31T20:10:17+05:30 IST