కరోనా విపత్తులో జర్నలిస్టుల పాత్ర అమోఘం - కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-25T01:33:40+05:30 IST

కరోనా కష్టకాలంలో సమాచార సేకరణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పాత్రికేయులను ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా గుర్తించేలా కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కరోనా విపత్తులో జర్నలిస్టుల పాత్ర అమోఘం - కిషన్ రెడ్డి

హైదరాబాద్: కరోనా కష్టకాలంలో సమాచార సేకరణ కోసం  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పాత్రికేయులను ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా గుర్తించేలా కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి  స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని టూరిజం ప్లాజా హోటల్ లో జరిగిన రెండు రోజుల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో పాత్రికేయులు ఆస్పత్రుల్లోకి తనతో పాటుగా ఐసీయూ లోకి సమాచార సేకరణ కోసం వచ్చారని గుర్తు చేసుకున్నారు. దేశంలో అత్యధిక జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐజేయూ జాతీయ కార్యవర్గ  సమావేశంలో పాల్గొనే అవకాశం తనకు దక్కడం గర్వంగా ఉందన్నారు. 


ఈ సమావేశంలో జరిగిన  చర్చను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తింపు దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా పెరగడంతో అసత్య ప్రచారాలు కూడా కొన్ని సందర్భాల్లో చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలను వార్తలుగానే రాయాలని విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నవరత్నాలు పథకం ద్వారా వివిధ వర్గాల సంక్షేమం ఎనలేని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, జర్నలిస్టుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 


ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ శ్రీనాథ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు, ఐజేయూ మాజీ అధ్యక్షులు ఎస్.ఎన్.సిన్హా, జాతీయ ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్ జమ్ము, ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, కార్యదర్శి.వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T01:33:40+05:30 IST