ఇంటింటా పారిశుధ్యం మెరుగుపరుచుకోవాలి
ABN , First Publish Date - 2020-05-11T10:34:28+05:30 IST
ప్రజలంతా ప్రతి వారం రోజులకోసారి ఇంటింటా పారిశుధ్యాన్ని మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్
మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు స్వచ్ఛతా పరిశుభ్రత కార్యక్రమం
కలెక్టర్, అదనపు కలెక్టర్లు క్యాంప్ కార్యాలయాలు శుభ్రం
స్వచ్ఛందంగా శుభ్రం చేసుకున్న జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యేలు
జగిత్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): ప్రజలంతా ప్రతి వారం రోజులకోసారి ఇంటింటా పారిశుధ్యాన్ని మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం ఉదయం 10 గంటలకు తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. అలాగే కలెక్టర్ రవి తన క్యాంప్ కార్యాలయంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు కుండీల్లో ఉన్న నీటిని తొలగించారు.
అదనపు కలెక్టర్ బి.రాజేశం తన క్యాంప్ కార్యాలయంలోని సంపులో పేరుకుపోయిన మురికి నీటిని తొలగించి ట్యాంక్ను శుభ్రం చేశారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత దంపతులు క్యాంప్ కార్యాలయంలోని చెత్తాచెదారం తొలగించి మురికి నీటిని తొలగించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో చెత్తను తొలగించి, కూలర్లలో ఉన్న నీటిని తొలగించి శుభ్రం చేశారు. బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణిప్రవీణ్ కుమార్ తన ఇంటిలో చెత్తాచెదారాన్ని తొలగించి, కూలర్లో ఉన్న మురికి నీటిని పారబోసి శుభ్రం చేశారు.