తెలంగాణలో ‘త్రీ ఐ మంత్ర’ నడుస్తోంది: కేటీఆర్
ABN , First Publish Date - 2021-10-26T00:11:27+05:30 IST
తెలంగాణలో అమలుచేస్తున్న కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ‘త్రీఐమంత్ర’ నడుస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో అమలుచేస్తున్న కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ‘త్రీఐమంత్ర’ నడుస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. త్రీ ఐ అంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ క్లూజివ్ గ్రోత్ అని వివరించారు. ఈ మూడింటిని దేశ వ్యాప్తంగా అమలు చేయగలిగితే ఖచ్చితంగా నయా భారత్ను కొత్తతరానికి అందించవచ్చని అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తాను మాట్లాడుతున్నానని చెప్పారు.హైదరాబాద్నగరం గూగుల్కు గుండెకాయలా, అమెజాన్కు ఆయువుపట్టులాంటిదని కేటీఆర్ అభివర్ణించారు. రాష్ట్రంలో ఐటీ రంగం దూసుకుపోతోందన్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీలో పాలన సంస్కరణలు, విద్యుత్, ఐటీ, పారిశ్రామికాభివృద్ధి పై తీర్మానాన్ని మంత్రి ప్రవేశ పెట్టారు. గడిచిన ఏడు సంవత్సరాల్లో పరిపాలన సంస్కరణలు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆవిష్కృతమయ్యాయని అన్నారు. సంక్షేమ ఫలాలను నిరాటంకంగా ప్రజలకు అందేలా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించడమే సంస్కరణల ఉద్దేశమని చెప్పారు. ఆ ఆశయంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంఆణలో చేపట్టిన సంస్కరణలు సువర్ణాధ్యాయాలుగా నిలిచాయన్నారు.