బీజేపీ పక్కా బిజినెస్ కార్పొరేట్ పార్టీ: Niranjan reddy
ABN , First Publish Date - 2021-11-16T21:38:13+05:30 IST
దేశంలో బీజేపీ పక్కా బిజినెస్ కార్పొరేట్ పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
హైదరాబాద్: దేశంలో బీజేపీ పక్కా బిజినెస్ కార్పొరేట్ పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు. పనీపాటా లేని బీజేపీ నేతలు లేనివి ఉన్నట్లు చిత్రీకరించి సమస్యగా మారారన్నారు. యాసంగి ధాన్యం కేంద్రం కొంటుందో, లేదో చెప్పాలని కోరుతున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర వరి ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ నేతలకు సిగ్గు ఉందా అని ఆయన నిలదీశారు. రైతులు పండించిన పంటలో బీజేపీ పాత్ర ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు.
రైతులకు ఇచ్చే కరెంట్లో బీజేపీ పాత్ర లేదన్నారు. రైతుల మోటార్లకు మీటర్లును పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందన్నారు. ఏ అర్హతతో రైతుల వద్ద ఆందోళన చేయటానికి వెళ్ళారని సంజయ్ను ప్రశ్నించారు. స్వతంత్ర భారతంలో రోజుల తరబడి రైతులు రోడ్ల మీద ధర్నా చేస్తుండటం బీజేపీ పాలనకు నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. మూర్ఖపు, అసత్యపు ప్రచారాలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీజేపీ చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆయన సవాల్ విసిరారు. రైతుల వద్దకు వెళ్ళి మీ ఇష్టానుసారంగా చేస్తామంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.