గల్ఫ్ దేశాలు మనవాళ్లకు తిరిగి ఉపాధి కల్పిస్తాయి: జైశంకర్
ABN , First Publish Date - 2021-03-16T14:39:32+05:30 IST
కరోనా నేపథ్యంలో భారత్కు తిరిగి వచ్చిన వారికి ఉపాధి కల్పించడంలో గల్ఫ్ దేశాలు సహకరిస్తాయని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. వందేభారత్ మిషన్ కింద ఇప్పటి వరకు 98 దేశాల నుంచి 45.82 లక్షల మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు వివరించారు.
గల్ఫ్ దేశాలు సహకరిస్తాయి!
ప్రధాని సంప్రదింపులు జరుపుతున్నారు: జైశంకర్
న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో భారత్కు తిరిగి వచ్చిన వారికి ఉపాధి కల్పించడంలో గల్ఫ్ దేశాలు సహకరిస్తాయని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. వందేభారత్ మిషన్ కింద ఇప్పటి వరకు 98 దేశాల నుంచి 45.82 లక్షల మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు వివరించారు. వారికి తిరిగి ఉపాధి అవకాశాలు కల్పించే విషయమై గల్ఫ్ దేశాలతో ప్రధాని మోదీ సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవాసుల సంక్షేమానికి సంబంధించిన అంశంపై జరిగిన చర్చలో మంత్రి జైశంకర్ ఈ మేరకు ప్రకటన చేశారు. కాగా, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గేది లేదని.. లాభనష్టాలతో సంబంధం లేకుండా అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ విధానం వర్తిస్తుందని లోక్సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పలువురు సభ్యులు వేసిన ప్రశ్నలకు జవాబుగా చెప్పారు.
2016 నుంచి ఇప్పటి వరకు 35 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని, నీతీ ఆయోగ్ సిఫారసుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 2021-22 బడ్జెట్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లుగా పెట్టుకున్నామన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ తర్వాత యాజమాన్యమే మారుతుందని, ఉద్యోగులు గతంలో మాదిరిగానే కొనసాగుతారని స్పష్టం చేశారు. కాగా, హరియాణాలోని కుండ్లి, తమిళనాడులోని తంజావూరులో ఉన్న రెండు ఫుడ్ టెక్నాలజీ సంస్థలను జాతీయ సంస్థలుగా ప్రకటించే బిల్లును సోమవారం రాజ్యసభ ఆమోదించింది.