ఆక్యుపెన్సీ పెరగాలి

ABN , First Publish Date - 2022-04-20T08:40:02+05:30 IST

: ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 78శాతానికి పెరిగేలా అధికారులు, సిబ్బంది శ్రమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు.

ఆక్యుపెన్సీ పెరగాలి

ఆర్టీసీ అధికారులతో రవాణా మంత్రి విశ్వరూప్‌

 సెస్‌ భారంపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం


అమరావతి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ 78శాతానికి పెరిగేలా అధికారులు, సిబ్బంది శ్రమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంగళవారం ఆయన విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌కు వచ్చారు. ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన సంస్థలో సమస్యలు, అధిగ మించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆర్టీసీ అభివృద్ధి కోసం అధికారులు, సిబ్బంది కష్టపడుతున్నారని, అయితే డీజిల్‌ ధరల పెరుగుదల సంస్థకు మోయలేని భారమైందని తెలిపారు. ఈ పరిస్థితుల్లోనే సెస్‌ విధించామని, ప్రజలు అర్థం చేసుకున్నా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.


సంస్థలో డ్రైవర్లు డ్యూటీలో ఉండగా తీవ్రమైన ఒత్తిడి, అస్వస్థతకు గురవుతున్నారని, ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడే ఉద్యోగుల విషయంలో అధికారులు సానుకూలంగా ఉండాలని సూచించారు. ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ సంస్థ నష్టాలు తగ్గించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని, బల్క్‌ ధరతో పోలిస్తే డీజిల్‌ రిటైల్‌గా రూ.5.86 తక్కువ ఉండటంతో భారం తగ్గించుకొంటున్నామని వివరించారు. మరికొన్ని అంశాలపై చర్చించారు. 

Updated Date - 2022-04-20T08:40:02+05:30 IST