తెలంగాణ పై కేంద్రానికి ఎందుకంత కక్ష: మంత్రి సబితారెడ్డి

ABN , First Publish Date - 2021-12-20T22:33:42+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్ష సాధిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుంటే కేంద్రం మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు.

తెలంగాణ పై కేంద్రానికి ఎందుకంత కక్ష: మంత్రి సబితారెడ్డి

కందుకూరు: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్ష సాధిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుంటే కేంద్రం మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. కందుకూరు మండలం ఆకుల మైలారంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి పాల్గొని మాట్లాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో పధకాలు అమలుచేస్తున్నారని చెప్పారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలుచేయకుండా కేంద్రం మొండివైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు.


కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కేంద్రం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి తెలంగాణ రైతులకు నట్టేట ముంచుతుందని మండిపడ్డారు. రైతులు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేసి నష్టపోకుండా ఉండాలని మంత్రి సూచించారు.


తెలంగాణలో ఇప్పటికే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల వద్ద ఉందన్నారు. కేంద్రం మాత్రం ఇప్పటి వరకు తీసుకుంది నామమాత్రమే అన్నారు. బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక లాగా, గల్లీలో మరోలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు.రైతులకు అండగా దేశ చరిత్రలో ధర్నా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే సబితారెడ్డి అన్నారు.

Updated Date - 2021-12-20T22:33:42+05:30 IST