హరితహారంలో 3లక్షల ఈత మొక్కలు నాటాము- మంత్రి శ్రీనివాస్గౌడ్
ABN , First Publish Date - 2020-07-05T00:17:37+05:30 IST
తెలంగాణలో ఆరో విడత హరితహారంలో భాగంగా ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో 3లక్షల తాటి మొక్కలను నాటినట్టు ఆశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో ఆరో విడత హరితహారంలో భాగంగా ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో 3లక్షల తాటి మొక్కలను నాటినట్టు ఆశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి హరితహారంలో ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 3కోట్ల 75లక్షల మొక్కలను నాటినట్టు చెప్పారు. శనివారం హరితహారంపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 12,751 గ్రామ పంచాయితీల్లో ఈ సంవత్సరం 4వేల గ్రామ పంచాయితీల్లో ఒక్కో గ్రామానికి వెయ్యి మొక్కల చొప్పున గ్రామ పరిధిలోని చెరువులు, కుంటలు , కాలువలు, నాలాలు , ప్రభుత్వ భూముల్లో ఎక్సైజ్ శాఖ అధికారులను భాగస్వాములను చేసి తాటి, ఈత , ఖర్జూర మొక్కలు నాటినట్టుచెప్పారు.
ఈ ఆర్ధిక సంవత్సరంల 4వేల గ్రామపంచాయితీలను తాటి, ఈత వనాల గ్రామాలుగా మార్చాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో నీరా పాలసీ లో భాగంగా కేరళ రాష్ట్రంలో సీపీసీఆర్ఐతో సాంకేతిక విషయ పరిజ్ఞానం మార్పిడి తొందరగా పూర్తిచెయ్యాలని ,పెట్బాటిల్ ప్యాకింగ్ గురించి త్వరగా స్డడీ పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అదే విధంగా కల్లుగీత వృత్తిలో ప్రమాద వశాత్తు చెట్లపై నుంచి కిందపడి శాశ్వత అంగవైకల్యం , మరణించిన వారి విషయంలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్పరాజ్ ఆహ్మద్, అదనపు కమిషనర్ అజయ్రావు, సహాయ డైరెక్టర్ హరికిషన్, డిప్యూటీ కమిషనర్ ఖురేషీ తదితరులు పాల్గొన్నారు.