లాక్డౌన్ ఆలోచన లేదు
ABN , First Publish Date - 2022-01-08T16:54:36+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ తీవ్రరూపం దాలుస్తున్నందు వల్లే ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, ప్రస్తుతానికి లాక్డౌన్ ఆలోచన లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం విధానసౌధలో కొవిడ్
- సామాన్యుల కష్టాలు మాకు తెలుసు
- 10 నుంచి బూస్టర్ డోసు
- వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ తీవ్రరూపం దాలుస్తున్నందు వల్లే ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, ప్రస్తుతానికి లాక్డౌన్ ఆలోచన లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం విధానసౌధలో కొవిడ్ నియంత్రణపై అధికారులతో ప్రత్యేక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రోజూ వేలల్లో కేసులు నమోదవుతుండడంతో ప్రత్యామ్నాయం లేకనే రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందన్నారు. సామాన్యుల కష్టాలు తమకు తెలుసని, అయితే అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించారు. రెండో కొవిడ్ కాలంలో సమస్యలను ఎవరూ మరువరాదన్నారు. అప్రమత్తంగా ఉంటేనే ఆరోగ్యం సాధ్యమని, స్వీయ నియంత్రణ లేకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సంసిద్ధం చేశామన్నారు. కొవిడ్, ఒమైక్రాన్ వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్రప్రభుత్వ సూచన మేరకు ఈనెల 10 నుంచి 60 ఏళ్లు పైబడినవారికి, కొవిడ్ వారియర్స్కు, హెల్త్ వర్కర్స్కు బూస్టర్ డోసు ఇస్తామన్నారు. అవసరమైన చోట్ల కొవిడ్కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్రాష్ట్ర ప్ర యాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి అన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లేవారికి 72 గంటలలోపు పొందిన ఆర్టీపీసీఆర్ కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసేలా కేంద్రరైల్వే మంత్రికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై లేఖ రాశారన్నారు. బెంగళూరులో 400కు పైగా మైక్రో కంటైన్మెంట్ జోన్లు చేశామని, కొవిడ్ కేసులు పెరగడంతో కొవిడ్ వార్ రూం తెరవనున్నట్టు తెలిపారు. సమావేశంలో బీబీఎంపీ, వైద్య ఆరోగ్యశాఖ, ఇతర అధికారులతో పాటు కొవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నారన్నారు.