స్మారక భవనగా జాషువా ఇల్లు!
ABN , First Publish Date - 2021-07-25T05:15:57+05:30 IST
జాషువా నివశించిన వల్లూరివారితోటలోని నివాసాన్ని స్మారకభవనంలా మార్చేందుకు సీఎం జగన్ దృష్టికి తీసుకె ళ్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
మంత్రి ఆదిమూలపు సురేష్
గుంటూరు, జూలై 24 : జాషువా నివశించిన వల్లూరివారితోటలోని నివాసాన్ని స్మారకభవనంలా మార్చేందుకు సీఎం జగన్ దృష్టికి తీసుకె ళ్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రం గుంటూరు నగరంపాలెం ఎస్బీఐ సెంటర్లో శనివారం గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలపై జుషువా తన రచనలతో దునుమాడారన్నారు. తెలుగు అకాడమీ ద్వారా జాషువా కవితలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు. గుంటూరులో జాషువా కళాపీఠం నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ గుంటూరులో జాషువా కళాపీఠానికి ఇప్పటికే 3 కోట్ల నిధులిచ్చినట్లు తెలిపారు. తెలుగు భాషకు జాషువా నుడికారం దిద్దారని, తెలుగుకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చారన్నారు. రాబోయే కొత్త జిల్లాల్లో ఒకదానికి జాషువా పేరు పెట్టాలని కోరారు. తొలుత జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, ఎమ్మెల్యేలు ఎండీ ముస్తఫా, మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, కేఎస్ లక్ష్మణరావు, కల్పలత, మద్య విమోచన అమలు కమిటీ చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి, పలువురు నేతలున్నారు.