ఈ పీఆర్సీకి అప్పుడు అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు సరికాదు: మంత్రి సురేష్
ABN , First Publish Date - 2022-01-20T18:38:30+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ పీఆర్సీకి అంగీకరించారని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ పీఆర్సీకి అప్పుడు అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు చేయడం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ పీఆర్సీకి అంగీకరించి మళ్లీ ఇప్పుడు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నా... దాని తీవ్రత రాష్ట్రంలో అంతగా లేదన్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని తెలిపారు. ఎక్కడైనా పిల్లలకు కోవిడ్ వస్తే ఆ పాఠశాల వరకూ మూసివేసి, శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. కొన్ని యూనివర్సిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందని మంత్రి సురేష్ పేర్కొన్నారు.