హుజూరాబాద్లో టీఆర్ఎస్దే గెలుపు: మంత్రి తలసాని
ABN , First Publish Date - 2021-08-11T20:57:09+05:30 IST
హుజూరాబాద్లో విపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని మంత్రి తలసాని అన్నారు.
హైదరాబాద్: హుజూరాబాద్లో విపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అక్కడ టీఆర్ఎస్దే విజయమన్నారు. తాము తలచుకుంటే.. టీఆర్ఎస్ను విమర్శించేవాళ్లు ఇక్కడ ఉండరని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థి, యువకుడని.. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి అని అన్నారు. గెల్లు శ్రీనివాస్ తండ్రి ఎంపీటీసీ, తల్లి సర్పంచ్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, అధిష్టానం ఆదేశిస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళతానని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
కాగా హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఇతనే అభ్యర్థి అని ‘ఏబీఎన్’ టీవీ చానెల్తో పాటు, ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే బుధవారం కేసీఆర్ అధికారికంగా ఆయన పేరే ప్రకటించారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.