ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకోవాలి
ABN , First Publish Date - 2021-01-17T06:22:07+05:30 IST
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, దేవుడిలాంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు
త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
నల్లగొండ, జనవరి 16 : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, దేవుడిలాంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎ్సబీసీ బత్తాయి మార్కెట్ యార్డులో శనివారం నిర్వహించిన గొర్రెల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో యాదవుల అభివృద్ధికి గొర్రెల పంపిణీ చేపట్టామన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 28వేల గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. రూ.5వేల కోట్లతో మొదలైన ఈ కార్యక్రమం ప్రస్తుతం రూ.12వేల కోట్లకు చేరిందన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో రూ.6వేల కోట్లతో చేపడుతామన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా 100 సంచార పశు వైద్య వాహనాలు ఏర్పాటు చేశామని, 1962 నెంబర్కు ఫోన్ చేస్తే ఈ వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. గొర్రెలకు బీమా పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారు. కొన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారని, తమ ప్రభుత్వం ఎన్నికలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. పాడి రైతులకు లీటర్ పాలపై రూ.4 ప్రోత్సాహకంగా ఇస్తున్నామన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ, కరోనా కారణంగానే ఏడాది పాటు గొర్రెల పంపిణీ ఆలస్యమైందన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల గురించి ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ ఫలితాలు శాశ్వతం కాదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. మంత్రి జగదీ్షరెడ్డి మాట్లాడుతూ, లక్షల మందికి పించన్లు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్రకుమార్, గాదరి కిషోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రాజేంద్ర, మునిసిపల్ చైర్మన్ సైదిరెడ్డి, రాంచందర్నాయక్ పాల్గొన్నారు.