తలసానిపై గంగపుత్రుల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-01-17T09:51:01+05:30 IST

మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తమపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గంగపుత్రులు ఆందోళన చేపట్టారు.

తలసానిపై గంగపుత్రుల ఆగ్రహం

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

మంత్రి పదవి నుంచి తొలగించాలి 

సంఘాల నేతల డిమాండ్‌ 


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌ : మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తమపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గంగపుత్రులు ఆందోళన చేపట్టారు. ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. తమ వృత్తిని కించపర్చేలా, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తలసాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రదేశ్‌ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో గంగపుత్రులు మహాధర్నా నిర్వహించారు. తమను అవమానపర్చిన తలసానిని వెంటనే మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని, జీవో 6ను రద్దు చేసి 74 జీవోను అమలు చేయాలని, ఈనెల 30వ తేదీలోగా తలసాని.. గంగపుత్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


అనంతరం తలసాని దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఆందోళనకారులను చిక్కడపల్లి పోలీసులు నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ప్రదేశ్‌ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  మల్లయ్య మాట్లాడుతూ బెస్తలు, ముదిరాజ్‌ల మధ్య తలసాని చిచ్చుపెట్టారని మండిపడ్డారు. భోలక్‌ఫూర్‌లో మహిళలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గంగపుత్రుల వృత్తిని దెబ్బతీసేలా మాట్లాడిన తలసాని వెంటనే క్షమాపణ చెప్పాలని భోలక్‌ఫూర్‌ గంగపుత్ర సంఘం మహిళ కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌లో గంగపుత్ర సంఘం ఆధ్వర్వాన రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ తీశారు. 


హైదరాబాద్‌ను దిగ్బంధిస్తాం

తలసానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని తెలంగాణ గంగపుత్రుల సంఘం డిమాండ్‌ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.లక్ష్మణ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.కె.ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని బెస్త, గంగపుత్రులందరికీ తలసాని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2021-01-17T09:51:01+05:30 IST