నగరంలో కొత్తగా మరో 25 బస్తీదవాఖానాలు- తలసాని
ABN , First Publish Date - 2020-08-13T22:43:46+05:30 IST
జంటనగరాల్లో కొత్తగా మరో 25 బస్తీదవాఖానాలను శుక్రవారం ప్రారంభించనున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
హైదరాబాద్: జంటనగరాల్లో కొత్తగా మరో 25 బస్తీదవాఖానాలను శుక్రవారం ప్రారంభించనున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మున్సిపల్శాఖ మంత్రి కె. తారక రామారావు, హోంశాఖ మంత్రి మహమూద్అలీ, డిప్యూటీస్పీకర్ పద్మారావు,ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ మేయర్ తదితరులు వీటిని ప్రారంభిస్తారని తెలిపారు. ప్రభుత్వ వైద్యసేవలను ప్రజలకు చేరువ చేయాలనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు లక్ష్యమని అన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలలో నుంచి ఏర్పాటు అయినవే బస్తీదవాఖానాలని మంత్రి తలసాని తెఇలపారు.
వీటి పనితీరు పట్ల ఎంతో శ్రద్ధతో ఉన్నారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసి పరిధికి సంబంధించి హైదరాబాద్ జిల్లాకు 95, రంగారెడ్డి జిల్లాపరిధిలో 32, మేడ్చల్ పరిధిలో 40, సంగారెడ్డిలో 3 చొప్పున ఇప్పటికే 170 బస్తీదవాఖానాలను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. బస్తీదవాఖానాల ద్వారా ప్రతి రోజూ సుమారు 14వేల మంది వైద్యసేవలను పొందుతున్నారని మంత్రి తెలిపారు. నూతనంగా 25 దవాఖానాల ప్రారంభంతో అదనంగా మరో 2వేల మందికి వైద్యసేవలు అందుతాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న బస్తీదవాఖానాలకు అదనంగా హైదరాబాద్ జిల్లాలో 18, మేడ్చల్లో 2 చొప్పున మరో 25 బస్తీదవాఖానాల ప్రారంభంతో వాటి సంఖ్య 195కు చేరుతుందన్నారు.
జీహెచ్ఎంసి పరిధిలో 300 దవాఖానాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రజల అవసరానలు బట్టి రానున్న రోజుల్లో బరిన్నిబస్తీదవాఖానాలను ఏర్పాటు చేస్తామన్నారు. వేలాది రూపాయల ఖర్చుచేసి వైద్య చికిత్సలు పొందలేకపోతున్న పేద ప్రజలకు ఈ బస్తీ దవాఖానాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని అన్నారు.