ఐజీఎస్టీ నిధులు 2,641 కోట్లు త్వరగా ఇవ్వండి

ABN , First Publish Date - 2020-09-23T08:24:23+05:30 IST

రాష్ర్టానికి రావాల్సిన రూ.2,641 కోట్ల ఐజీఎస్టీ నిధులను అక్టోబరు 5లోపు విడుదల చేయాలని..

ఐజీఎస్టీ నిధులు  2,641 కోట్లు త్వరగా ఇవ్వండి

అక్టోబరు 5లోపే చెల్లించండిహరీశ్‌ డిమాండ్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ర్టానికి రావాల్సిన రూ.2,641 కోట్ల ఐజీఎస్టీ నిధులను అక్టోబరు 5లోపు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో ఈ మొత్తం రాష్ర్టాలకు అవసరమని గుర్తు చేశారు. ఐజీఎస్టీ కన్వీనర్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌పై చర్చించారు. హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టానికి రావాల్సిన ఐజీఎస్టీ నిధులను వెంటనే చెల్లించే విధంగా సిఫార్సు చేయాలని కమిటీ కన్వీనర్‌ను మంత్రి కోరారు.


ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేయనున్నట్టు సుశీల్‌ కుమార్‌ మోడీ చెప్పారు. అక్టోబర్‌ 1న తిరిగి సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఎనిమిది రాష్ర్టాల నుంచి వసూలు చేయాల్సివ రూ.1,015 కోట్లను కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుండి భవిష్యత్తులో చెల్లింపుల సమయంలో అడ్జస్ట్‌ చేయాలని సూచించారు. అలాగే, 18 రాష్ర్టాల నుంచి రికవరీ చేయాల్సిన కాంపెన్సేషన్‌ ఫండ్‌ను ఆ రాష్ర్టాలకు భవిష్యత్‌లో చెల్లించే పరిహార మొత్తంలో సర్దుబాటు చేయాలని కూడా మంత్రి సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూ కుమారి ప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-23T08:24:23+05:30 IST