లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్...
ABN , First Publish Date - 2021-10-15T14:19:29+05:30 IST
దేవి నవరాత్రులు విజయవంతంగా జరిగాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
విజయవాడ: దేవి నవరాత్రులు విజయవంతంగా జరిగాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. చిన్నచిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు. తిరుమల, ఇంద్రకీలాద్రి సీఎం జగన్ పర్యటనపై లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రిపై టీడీపీ నేతలు అసత్య విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు దేవుళ్ళు, హిందూమతం గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బూట్లు వేసుకుని ఆలయాలకు వచ్చే ఆయన సీఎంని విమర్శిండం విడ్డూరంగా ఉందన్నారు. తిరుమలలో ప్రసాదాన్ని సీఎం కళ్లకద్దుకుంటే వాసన చూస్తున్నారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చివేశారన్నారు. సీఎం జగన్ దేవాలయాలయను నిర్మిస్తున్నారన్నారు. 23 సీట్లు ఉన్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో మూడు సీట్లు కూడా రావని వెల్లంపల్లి అన్నారు.