వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన
ABN , First Publish Date - 2021-07-23T07:52:03+05:30 IST
: నిర్మల్ పట్టణంతో పాటు జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వర్షాలు కరుస్తుండగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.
- సహయక చర్యల పర్యవేక్షణ
- బాలింత, యువకుడిని రక్షించిన రెస్క్యూ టీం
- ఎన్డీఆర్ఎఫ్ బృందాల రాక
- అధికారులతో మంత్రి సమీక్ష
నిర్మల్ కల్చరల్, జూలై 22 : నిర్మల్ పట్టణంతో పాటు జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వర్షాలు కరుస్తుండగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. పలు కాలనీలు జలమయం కాగా ఆయా ప్రాంత వాసులతో మంత్రి మాట్లాడారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆదేశించారు. జీఎన్ఆర్ కాలనీలో ఓ బాలింత జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలుసుకున్న మంత్రి అక్కడికి చేరుకొని బాలింతతో పాటు 11 రోజుల పసికందును, మరో యువకుడిని ఆదుకునేందుకు రెస్క్యూ టీం రప్పించి కాపాడారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి ఐకే రెడ్డి
భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బాధితులను ఆదుకునేందుకు అన్నిచర్యలు తీసుకుంటామ న్నారు. నిత్యావసరాలు, తాగునీటి కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. నిర్మల్ పట్టణ ఎగువభాగంలో పలుకాలనీలు నీట మునగడంతో 300 మంది వరకు జల దిగ్బంధంలో చిక్కుకున్నారన్నారు. రెస్క్యూటీంల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. స్థానికులు బాధితులకు అండగా నిలవాలని కోరారు. గురు వారం సాయంత్రానికి నిర్మల్కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని సహయక చర్యలు చేపడతారన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.