మంత్రులూ.. గో బ్యాక్
ABN , First Publish Date - 2022-07-01T09:13:45+05:30 IST
మంత్రులూ.. గో బ్యాక్
కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్లకు నిరసన సెగ
తాడేపల్లిగూడెం రూరల్, జూన్ 30: ఇళ్ల మధ్యలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎ్సటీపీ) ఏర్పాటు కోసం వచ్చిన రాష్ట్ర మంత్రులకు నిరసన సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. రూ.34.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎస్టీపీ శంకుస్థాపన నిమిత్తం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి ఆదిమూలపు సురేశ్ వచ్చారు. ఇళ్ల మధ్యలో ఇలాంటి ప్లాంట్ ఏర్పాటు వల్ల తమకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని స్థానికులు ఆందోళన చేశారు. ‘ఎస్టీపీ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకోవాలి. మంత్రులూ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలోనూ ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని, ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్మాణం చేపడతామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పగా, ‘ముందు అక్కడ ఏర్పాటైన తర్వాత.. దాని పనితీరు చూసి ఇక్కడ ఏర్పాటుకు అంగీకరిస్తాం’ అని స్థానికులు స్పష్టం చేశారు. దీంతో అలాగే నంటూ శంకుస్థాపన చేయకుండానే మంత్రులు వెనుదిరిగారు.