టీఆర్ఎస్కు హుజురాబాద్ కంచు కోట
ABN , First Publish Date - 2021-06-29T23:42:14+05:30 IST
టీఆర్ఎస్కు హుజురాబాద్ కంచు కోటగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి
కరీంనగర్ /జమ్మికుంట: టీఆర్ఎస్కు హుజురాబాద్ కంచు కోటగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గడిచిన 30,40ఏళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రపంచంలో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు గొప్పవని ఆయన ప్రశంసించారు. మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేయడం అంటే మాటలు కాదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచి టాక్సులు వెళ్లడమే తప్ప, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది ఏమీ లేదని ఆయన విమర్శించారు. రూ.2 కిలో బియ్యం ఇస్తామంటే ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి చేసిన పేద రాష్ట్రం మనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఏదో ఒక దానికి కేంద్రం ఒక రూపాయి ఇస్తే, మాదే మొత్తం అని చెప్పుకోవడం దౌర్భాగ్యమన్నారు.
ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్కు హుజురాబాద్ కంచు కోటగా ఉందని ఆయన అన్నారు. ఈటల రాక ముందే ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. రాబోయే తెలంగాణ ఫలితాలకు హుజురాబాద్ వేదిక కాబోతుందని ఆయన జోస్యం పలికారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఒక్కరు కూడా తప్పు చేయవద్దన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి పునరుద్ఘటించారు.