Mirabai Chanu: కల నిజమైంది.. ఈ పతకం దేశానికి అంకితం
ABN , First Publish Date - 2021-07-24T22:06:31+05:30 IST
ఒలింపిక్స్ భారత్కు తొలి పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది.
టోక్యో: ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. తాను సాధించిన పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్టు పేర్కొంది. తన ఒలింపిక్ ప్రయాణంలో కోట్లాదిమంది భారతీయుల ప్రార్థనలు తన వెన్నంటే ఉన్నాయని పేర్కొంది. ఈ సందర్భంగా తన కుటుంబానికి, మరీ ముఖ్యంగా తన తల్లికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని, తన కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేసుకుంది. తల్లి తనపై పూర్తి విశ్వాసం ఉంచిందని పేర్కొంది.
తనకు నిరంతరాయంగా మద్దతు అందించి ప్రోత్సహించిన ప్రభుత్వానికి, క్రీడా మంత్రిత్వశాఖ, ఎస్ఏఐ, ఐఓఏ, వెయిట్లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే, ఓజీక్యూ, స్పాన్సర్లు, తన మార్కెటింగ్ ఏజెన్సీ ఐఓఎస్ తదితరులకు మీరాబాయి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. కోచ్ విజయ్ శర్మ, సపోర్ట్ స్టాఫ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది.
టోక్యోలో నేడు జరిగిన వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్నాచ్లో 87 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 115 కిలోలు కలిపి మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారతకు తొలి పతకాన్ని అందించింది. ఫలితంగా కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు మరో పతకం దక్కింది.