మిస్ ఇండియా కంటెస్టెంట్.. సివిల్స్లో 93వ ర్యాంక్!
ABN , First Publish Date - 2020-08-05T23:59:08+05:30 IST
సివిల్స్ ఫలితాలు ఎపుడు విడుదలైనా టాపర్ల ప్రస్తావనే ఎక్కువగా వినపడుతుంటుంది. అయితే తాజాగా విడుదలైన ఫలితాల్లో టాపర్లతో పాటూ ఇతర ర్యాంకర్లు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటున్నారు.
న్యూఢిల్లీ: సివిల్స్ ఫలితాలు ఎపుడు విడుదలైనా టాపర్ల ప్రస్తావనే ఎక్కువగా వినపడుతుంటుంది. అయితే తాజాగా విడుదలైన ఫలితాల్లో టాపర్లతో పాటూ ఇతర ర్యాంకర్లు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటున్నారు. వీరిలో రాహుల్ మోదీ పేరు ముందు వరుసలో ఉంది. భారత్లో ఇద్దరు ప్రధాన రాజకీయ ప్రత్యర్థుల పేర్ల సమాహారంగా రాహుల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు. ఇక సివిల్స్లో ఆయన 420వ ర్యాంకు సాధించడం మరో ప్రత్యేక.
ఈ క్రమంలోనే ప్రస్తుతం వైరల్ అవుతున్న మరో ర్యాంకర్ ఐశ్వర్య షియోరన్. మోడల్ ఐఏఎస్ అధికారిగా ఆమెను మీడియా పొగడ్తల్లో ముంచెత్తుతోంది. ఆమె మోడలింగ్ కూడా చేస్తుండటమే అందుకు కారణం. అంతేకాదు.. ఐశ్వర్య గతంలో మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొన్నారు. ఆ పోటీల్లో తుది దశవరకూ వెళ్లి టాప్ 21లో నిలిచారు. ప్రస్తుతం సివిల్స్లో ఆమె 93 ర్యాంకు సాధించారు. అయితే ఐశ్వర్య.. ప్రత్యేకతలు అక్కడితో ఆగిపోలేదు. నటి ఐశ్వర్య లాగా తాను కూడా మిస్ ఇండియా అవ్వాలనే తల్లిదండ్రులు ఈ పేరు పెట్టారని ఆమె చెప్పుకొచ్చారు.
‘నటి ఐశ్వర్యలాగా నేను కూడా మిస్ ఇండియా అవ్వాలని అమ్మానాన్నా నాకు ఈ పేరు పెట్టారు. ఆ పోటిల్లో నేను టాప్ 21 వరకూ వెళ్లా’ అని ఆమె తెలిపారు. సివిల్స్ అధికారి కావడమనేది తన చిరకాల వాంఛ అని ఆమె అన్నారు. మోడల్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె..ఆ రంగం నుంచి బ్రేక్ తీసుకుని సీవిల్స్ పరీక్షల్లో విజయం సాధించారు. ఢిల్లీలో జరిగిన అందాల పోటీల్లో ఫ్రెష్ ఫేస్గా నెగ్గడంతో మోడల్గా ఆమె ప్రయాణం ప్రారంభమైంది. ఆ తరువాత మిస్ ఇండియాలో పోటీల్లో తుది దశ వరకూ వెళ్లడంతో మోడలింగ్ రంగం ఆమెకు రెడ్ కార్పెట్ పరిచింది. తాజాగా ఆమె ఐఏఎస్గా ఎంపికవడంతో ఐశ్వర్య జీవితం మరో కీలక మలుపు తిరిగింది.